మేడ్చల్ : మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి మండలంలోని ఏవీబీ పురం ప్రాంతంలో నాలాపై ఏర్పడిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు సోమవారం తొలగించారు. పరికి చెరువు నుంచి కూకట్పల్లి నాలాలో కలిసే 10 మీటర్ల వెడల్పు గల ఈ నాలా, గత కొన్నేళ్లుగా ఆక్రమణకు గురైంది.
నాలాపై రెండు షట్టర్లు నిర్మించడంతో పాటు మ్యాన్హోల్పైన కూడా దుకాణాలు వేసి సెల్ఫోన్లు, ల్యాప్టాప్ల విక్రయాలు, మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా వర్షం కురిసినప్పుడల్లా నీరు సాఫీగా పారక, సమీపంలోని సాయిబాబా కాలనీ, హెచ్ఏఎల్ కాలనీ, మైత్రినగర్ ప్రాంతాలు వరద ముంపుకు గురవుతున్నాయి.
స్థితిగతులపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేయడంతో జలమండలి అధికారులు పరిశీలించి నివేదిక అందించారు. ఆ నివేదిక ఆధారంగా హైడ్రా బృందం కూల్చివేతలు చేపట్టింది. దీంతో ముంపు సమస్య నుంచి విముక్తి లభిస్తుందనే ఆశతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు.