Air India అంతర్జాతీయ షెడ్యూల్ పునఃప్రారంభం..

న్యూఢిల్లీ : అహ్మ‌దాబాద్ లో జూన్ 12న జరిగిన ఘోర ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంపై తాత్కాలిక “సేఫ్టీ పాజ్” ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆగస్టు 1 నుండి అంతర్జాతీయ విమాన సేవలను పాక్షికంగా పునరుద్ధరిస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది.

ఈ పునరుద్ధరణ సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుందని, అక్టోబర్ 1 నాటికి అన్ని సేవలను పూర్తిగా పునఃప్రారంభించాలనే లక్ష్యంతో లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు వెళ్తున్న AI171 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది, అలాగే భూమిపై ఉన్న 19 మంది మరణించారు. 67 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇంధన నియంత్రణలో లోపమే కారణం..

భారత విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIB) చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంధన నియంత్రణ స్విచ్‌లు అనుకోకుండా “కటాఫ్” స్థితిలోకి మారడంతో రెండు ఇంజిన్‌లు పనిచేయకుండా నిలిచిపోయాయి. 2018లో FAA జారీ చేసిన హెచ్చరికలోనూ ఇలాంటి సమస్యలపై స్పష్టమైన సూచనలు ఉండటం గమనార్హం.

ఈ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా తన 787 విమానాలన్నింటినీ విస్తృతంగా భద్రతా తనిఖీలు చేస్తోంది. మరోవైపు, పాకిస్తాన్, మిడిల్ ఈస్ట్ గగనతల పరిమితులు కూడా విమాన సమయాలను పెంచాయి. దీంతో షెడ్యూల్‌లో మరిన్ని సర్దుబాట్లు అవసరమయ్యాయి.

ప్రధాన మార్పులు ఇలా..

  • ఈ పరిణామాల నేపథ్యంలో ఎయిర్ ఇండియా పలు మార్గాల్లో సేవలను పునరుద్ధరించగా, కొన్ని రూట్లను తాత్కాలికంగా తగ్గించింది.
  • అహ్మదాబాద్-లండన్ గాట్విక్ మార్గానికి బదులు, అహ్మదాబాద్-లండన్ హీత్రూ రూట్ ఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 30 వరకు వారానికి మూడు సార్లు తిరిగి ప్రారంభమవుతుంది.
  • ఢిల్లీ-లండన్ హీత్రూ రూట్ జూలై 16 నుండి తిరిగి వారానికి 24 విమానాల వరకు విస్తరించనుంది.
  • ఢిల్లీ-టోక్యో (హనేడా) దిశలో పూర్తి రోజువారీ సేవలు ఆగస్టు 1 నుంచి పునఃప్రారంభమవుతాయి.
  • ఢిల్లీ-జ్యూరిచ్ విమానాల సంఖ్యను కూడా ఆగస్టు 1 నుంచి వారానికి 4–5 సార్లు పెంచనున్నారు.
  • ఢిల్లీ-సియోల్ (ఇంచియాన్) రూట్ సెప్టెంబర్ 1 నుంచి వారానికి ఐదు సార్లు కొనసాగుతుంది.
  • ఇదే సమయంలో బెంగళూరు-లండన్ (హీత్రూ) ఆగస్టు 1 నుంచి వారానికి నాలుగు సార్లు మాత్రమే పనిచేయనుంది. యూరప్ (ప్యారిస్, మిలన్, కోపెన్‌హాగన్, వియన్నా), ఉత్తర అమెరికా (న్యూయార్క్, చికాగో, టొరంటో, వాంకోవర్, శాన్ ఫ్రాన్సిస్కో)కు కొన్ని విమానాల సంఖ్యను కూడా తాత్కాలికంగా పరిమితం చేశారు.

ఈ షెడ్యూల్ సర్దుబాట్ల వల్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పింది. అలాగే, ఈ సవాలుతో కూడిన పరిస్థితుల్లో తమకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపింది.

Leave a Reply