గుడిహత్నూర్ హైవే రోడ్డుపై జేసీబీని ఢీకొన్న కారు
గుడిహత్నూర్ (ఆదిలాబాద్ జిల్లా), ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ (Adilabad) జిల్లా గుడిహత్నూర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం (Two deaths) పాలయ్యారు. ఈ ప్రమాదంలో ముండే ఆర్యన్ (17), మరో యువకుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సంఘటన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి గుడిహత్నూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిందిలా…
జైనూర్ మండల కేంద్రానికి చెందిన గుగ్గే ఉత్తమ్ రావు (Uttam Rao) అనే వ్యాపారి కారును తన కూతురు కొడుకు ముండే ఆర్యన్ మంగళవారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరికి తెలియకుండా తీసుకుని తన మిత్రునితో కలిసి ఆదిలాబాద్ వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఆగి ఉన్న జేసీబీ వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముండే ఆర్యన్ (17) (Munde Aryan) అక్కడికక్కడే మృతి చెందాడని, ఆయన వెంట ఉన్న మిత్రుడికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న యువకుడిని హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.