Gold Smuggling: బెల్టులో పది కిలోల బంగారం… అదుపులో ఇద్దరు ఇటాలియన్లు
బెల్టులో రహస్యంగా బంగారు నాణాలను దాచి తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మిలాన్ నుంచి వచ్చిన ఈ ప్రయాణికులు ఇద్దరి వద్ద కలిపి మొత్తం పది కిలోల బంగారు నాణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి జరిపిన తనిఖీలలో ఈ స్మగ్గింగ్ దందా బయటపడిందని ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు చెప్పారు.
ఇటలీలోని మిలాన్ నుంచి వచ్చిన విమానంలో ఇద్దరు ప్రయాణికుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు తనిఖీ చేశారు. లగేజీ క్షుణ్ణంగా సోదా చేసినా ఏమీ కనిపించలేదు. దీంతో మరోసారి తనిఖీ చేయగా.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బెల్టులు కనిపించాయని అధికారులు తెలిపారు. వాటిలో రహస్యంగా దాచి తీసుకొచ్చిన బంగారు నాణాలు బయటపడ్డాయని చెప్పారు.
వాటిని తూకం వేయగా 10.092 కిలోలు ఉన్నాయని, మార్కెట్ లో ఆ నాణాల విలువ రూ.7.8 కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు. ఈ బంగారు నాణాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసి, ప్రయాణికులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పట్టుబడ్డ ప్రయాణికులు ఇద్దరూ కశ్మీర్ కు చెందిన వారేనని అధికారులు తెలిపారు.