మంత్రివర్గంలోకి అడ్లూరి ..
సీఎంఓ నుండి సమాచారం …
మాదిగ సామాజిక వర్గ కోటా కింద ..
నేడు రాజభవన్ లో ప్రమాణ స్వీకారం
ధర్మపురి ఆంధ్రప్రభ తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో జగిత్యాల జిల్లా ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు చోటు లభించనుంది. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అందుబాటులో ఉండాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నాలుగు రోజుల క్రితం తెలంగాణ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రెటరీ కెసి వేణుగోపాలు కలిసి తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించాలని విన్నవించడంతో ఢిల్లీ పెద్దలు ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు.
మాదిగ సామాజిక వర్గ కోటా కింద లక్ష్మణ్ కుమార్ ను మంత్రి పదవి వరించనుంది.అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1982 నుండి 85 వరకు గోదావరిఖని జూనియర్ కళాశాల ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా, 1986 నుండి 94 వరకు ఎన్ఎస్యూఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుండి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి 2006లో ధర్మారం (ఎస్సీ) రిజర్వుడ్ స్థానం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచాడు.
ఆయన 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు.అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2010 నుండి 2012 వరకు కరీంనగర్ జడ్పీ ఛైర్మన్గా పని చేశాడు. ఆయన 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు,
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో ధర్మపురి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. లక్ష్మణ్ కుమార్ 2013 నుండి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్గా పని చేశాడు.
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆ తరువాత జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడై, 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై 2023 డిసెంబర్ 9న శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను 2023 డిసెంబర్ 15న ప్రభుత్వ విప్గా ప్రభుత్వం నియమించింది.