Chintana | తగ్గడమే… నెగ్గడం!


వ్యక్తుల మధ్య, అలాగే రాజ్యాల మధ్య కలహాలు, వ్యాజ్యాలు, యుద్ధాలు సర్వసాధారణం. న్యాయస్థానాలలో న్యాయ విచారణలు, రాజ్యాల మధ్య యుద్ధాలు త్వరగా ముగింపుకు చేరవు. సుదీర్ఘ కాలం తర్వాత, అవి ముగిసినా కూడా వాటిలో గెలిచిన వారికీ, ఓడిన వారికి కూడా అప్పటికే ఎంతో ధన నష్టం, జన నష్టం, మానసిక క్లేశాలు ఎక్కువగానే అనుభవానికి వచ్చి ఉంటాయి. అందుకే అంటుంటారు ”ఓడిన వాడు బ#హరంగంగా ఏడిస్తే గెలిచిన వాడు లోలోపల ఏడుస్తుంటాడు” అని.
అసలు ఇలాంటి తగాదాలు/వ్యాజ్యాలు ఆరంభ దశలోనే పరస్పర అంగీకారంతో పరిష్కరింపబడడం ఉత్తమం. కొంతకాలం తర్వాతనైనా చర్చల ద్వారా పరిష్కరించుకొంటే మధ్యమం. చివరిదాకా లాగబడి అపారమైన కష్ట నష్టాలతో ముగిస్తే అది అధమం. అయితే ఆవేశకావేషాలు, రోషద్వేషాలు పగను ఎగదోస్తాయి.


”పగ అడగించుటెంతయు శుభంబది లెస్స- అడంగునే పగన్‌ పగ? పగ గొన్న మార్కొనక, పల్కక యుండగ వచ్చునే? కడున్‌ తెగ మొదలెత్తి పోవ పగ తీర్పగ వచ్చిన క్రౌర్య మొందు, ఏమి గతి తలంచినన్‌ పగకు మేలిమి లేమి ధృవంబు కేశవా ! ”అంటూ మహాభారలో శ్రీకృష్ణుని, తమ తరఫున రాయబారిగా కౌరవ సభకు పంపుతూ, ధర్మరాజు చెబుతాడు. పగ ఉంటే పాము ఉన్న ఇంటిలో నివసించినట్లుగా క్షణ క్షణం భయపడుతూ బ్రతక వలసి వస్తుంది అంటాడాయన. అందుకే యుద్ధం వరకూ రాకుండా, తమకు గ్రాస వాసాలకై ఒక అయిదు ఊళ్ళు ఇచ్చినా చాలును అంటాడు ధర్మరాజు. కౌరవులను తెగటార్చడానికి తగినంత సామర్థ్యం ఉన్నా, కౌరవుల దౌష్ట్యాన్ని స#హంచి, జనక్షయం జరుగకుండా ఆపడానికి గాను క్షమాగుణాన్ని అలవరచుకున్నాడాయన.


అలాగే శ్రీ కృష్ణుడు, తాను తన మేనత్తకు చేసిన వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకొనే, శిశుపాలుని 99 తప్పులు క్షమిస్తాడు. నూరవ తప్పు చేయగానే శిశుపాలుని వధిస్తాడు. క్షమించేవాడు, క్షమించబడే వానికన్నా, అన్ని విధాలా అధికునిగా, శ్రేష్ఠునిగా లోకంచేత కొనియాడబడతాడు.
”చెల్లియుండియు సైరణ చేయునతడు” పుణ్య పురుషుడంటుంది మహాభారతం. శత్రువు చేతులెత్తివేసి శరణు కోరితే క్షమించడం మన భారతీయ సంస్కృతి. ”శరణంబని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి కావగ వలయున్‌ / కరుణా పరుల తెరంగిది/ ఇరవుగ సరి కావు దీనికే ధర్మంబుల్‌”. అవతలి పక్షం వాడైన శత్రువు ఎంతటి భయంకరమైన స్వభావం కలవాడైనా, శరణు కోరితే కరుణామయులు కాదనరు. ఇది ధర్మాలన్నింటిలోనూ అత్యుత్తమ ధర్మము.


అయితె, క్షమాశీలత అంటే శత్రువులోని నేర ప్రవృత్తిని ప్రోత్స#హంచడం కాదు. శత్రువులో సానుకూలమైన, ఆశించిన, మార్పు రావడానికి కొంత అవకాశము ఇవ్వడమే క్షమ. క్షమాగుణం కలవారిని మెత్తని వారిగా భావించి, శత్రువు మరొకమారు దాడి చేయబోతే మాత్రం ఊరుకోకుండా చావు దెబ్బ కొట్టి బుద్ధి చెప్పగలగడమే అసలు సిసలైన ధీరుల లక్షణం. ఇదే నాటి నుండి నేటి వరకు మనవారు అనుసరిస్తున్న ధర్మం.

– గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి
9440781236

Leave a Reply