AP | కశ్మీర్ లో చిక్కుకున్న‌ విద్యార్థులు.. స్వ‌స్థ‌లాల‌కు పంపాల‌ని ఎంపీ శ‌బ‌రి లేఖ

తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ కశ్మీర్ లో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను వారి స్వ‌స్థ‌లాల‌కు పంపే ఏర్పాట్లు చేయాల‌ని కోరుతూ నంద్యాల లోక్ సభ సభ్యురాలు శబరి ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ కు లేఖ రాశారు. పహ‌ల్గామ్ దురాగతం నేపథ్యంలో భారత సైన్యం పాకిస్తాన్ లో తలదాచుకున్న ఉగ్రవాదుల వేట మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు పిచ్చెక్కినట్టు పాకిస్తాన్ సైన్యం సరిహద్దు జనావాసాలపై కాల్పులు జరుపుతోంది. భారతసైన్యం గట్టిగా తిప్పికోట్టడంలో నిమగ్నమై ఉంది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లతో పాటు దేశ సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిషేధాజ్ఞలు అమలు చేస్తోంది.

ఈరోజు కశ్మీర్ లోని షేర్ ఎ కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ టెక్నాలజీలో చదువుకుంటున్న విద్యార్థుల్లోని తమ పిల్లల గురించి వారి కుటుంబ సభ్యులు నంద్యాల ఎంపీ శబరిని కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆమె ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ కు లేఖ రాశారు. అందులో ఎం.రవీంద్ర నాయక్, బి సోమేశ్వరరావు, బి.లక్ష్మి కళ్యాణ్, ఎన్.హారికశ్రీ, ఎ.సాయి మహేశ్వరీ, ఎస్.అసిఫ్ బాషా, మౌనిక, వి.శశికిరణ్ రెడ్డిల పేర్లను, వారి సెల్ నెంబర్లతో పంపించారు. వారిని కాపాడి సురక్షితంగా రాష్ట్రానికి పంపించేందుకు కృషి చేయాలని కోరారు. ఆమె లేఖని జత చేసిన రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా లవ్ అగర్వాల్ కు ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. మరోవైపు రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా కాపాడి ఇంటికి చేరుస్తామని భరోసా ఇచ్చారు.

Leave a Reply