Uttarakhand | కుప్ప‌కూలిన హెలికాప్ట‌ర్ – ఆరుగురు దుర్మ‌ర‌ణం

ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీలో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక ఆంధ్రప్రదేశ్ మహిళ ఉండగా, గాయపడిన వ్యక్తి కూడా ఆ రాష్ట్రానికే చెందిన వారని అధికారులు తెలిపారు.

గురువారం ఉదయం 9 గంటలకు ఘటన జరగ్గా, ప్రమాద సమయంలో హెలికాప్టర్​లో ఏడుగురు ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, అధికారులతో పాటు సహాయక బృందాలు స్థలానికి బయలుదేరాయి. వెంటనే సహాయక చర్యలను ప్రారంభించాయి. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ప్రైవేట్ కంపెనీ ఏరోట్రాన్స్ సర్వీస్ కు చెందినదిగా అధికారులు తెలిపారు. హెలికాప్టర్ మారుమూల ప్రాంతంలో అడవిలో కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన గంగాని ప్రాంతం ఉత్తరకాశీ జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి దాదాపు 50 కి.మీ దూరంలో ఉంటుంది.

బాధితుల వివరాలు
హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని కాలా సోని (61), విజయ రెడ్డి (57), రుచి అగర్వాల్ (56), రాధా అగర్వాల్ (79), వేదవతి కుమారి (48)గా అధికారులు గుర్తించారు. వేదవతి ఏపీ మహిళగా నిర్ధరించారు. పైలట్ రాబిన్ సింగ్ కూడా మరణించినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తి ఏపీకి చెందిన మస్తు భాస్కర్​(51)గా తెలిపారు.

ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. “ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ తీవ్రమైన నష్టాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను,” అని ఆయన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని, ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం వెల్లడించారు.

Leave a Reply