మండల స్థాయిలోనే ప్రజల సమస్యలకు పరిష్కారం

గోవిందరావుపేటలో ప్రజావాణిని ప్రారంభించిన మంత్రి సీతక్క..

దరఖాస్తులు స్వీకరణ

గోవిందరావుపేట, ఆంధ్రప్రభ: ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి (గ్రీవెన్స్ సెల్) కార్యక్రమాన్ని గోవిందరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మంత్రి సీతక్క సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. గతంలో ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతి సోమవారం ములుగు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేదని మంత్రి తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై గోవిందరావుపేట మండల ప్రజలు సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానిక అధికారులకు దరఖాస్తులు అందజేయవచ్చని తెలిపారు.

ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యలను స్వీకరించి, పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని మంత్రి సీతక్క సూచించారు. ఎమ్మార్వో సృజన్‌కుమార్, ఎంపీడీవో వరుణ్‌కుమార్‌లు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో సృజన్‌కుమార్, ఎంపీడీవో వరుణ్‌కుమార్, వ్యవసాయ అధికారి జితేందర్, మండల విద్యాధికారి దివాకర్, మార్కెట్ చైర్మన్ కళ్యాణి, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, గోవిందరావుపేట మండల సహకార సంఘం చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి, పస్రా సర్పంచ్ సుమలతతో పాటు వివిధ శాఖల అధికారులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.