తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే

  • ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

నర్సాపురం, ఆంధ్రప్రభ : నర్సాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ అంబులెన్స్‌ సేవలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విప్‌, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు సకాలంలో అత్యవసర వైద్య సేవలు అందించడంలో తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ అంబులెన్స్‌ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.