ఆపదలో అండగా నిలిచిన బ్లూ కోర్ట్ పోలీసులు

కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలం మాసాయిపేట్‌ గ్రామం వద్ద మానవత్వం చాటుకున్నారు బ్లూ కోర్ట్‌ పోలీసులు. ఎలగడపకు చెందిన ఆడెపు రాములు కూరగాయల ఆటో మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆటోలోని కూరగాయలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.

అదే సమయంలో అటుగా వెళ్తున్న బ్లూ కోర్ట్‌ పోలీసులు భీమ్‌రావు, గణేష్‌ వెంటనే స్పందించి ఆటోను పైకి లేపారు. రోడ్డుపై పడిపోయిన కూరగాయలను ఏరి తిరిగి ఆటోలోకి ఎక్కించి పంపించారు. ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేసిన పోలీసుల తీరును స్థానికులు అభినందించారు.