అంగన్వాడీలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ మాట్లాడుతూ పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు పట్టించడం ఆరోగ్యవంతమైన జీవితానికి పునాదిగా నిలుస్తుందని తెలిపారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించి, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని, ప్రసవం అనంతరం వచ్చే ముర్రుపాలను తప్పనిసరిగా శిశువుకు ఇవ్వాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని కోరారు. అనంతరం సామూహిక శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీలత, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.