బండికి పాలనపై అవగాహన లేదు

  • హరీష్ కు పట్టిన రోగమే బండికి పట్టింది
  • డైలాగులు వద్దు.. డ్యామ్ సేఫ్టీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించు
  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి జగ్గారెడ్డి సూచన
  • తుంగతుర్తి వ్యవహారంపై త్వరలోనే పీసీసీకి నివేదిక అందజేస్తామని వెల్లడి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో డ్యామ్ సేఫ్టీ అధికారులతో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుల సమావేశం ఏర్పాటు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు బయటపడతాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి పాలనపై పూర్తి అవగాహన లేకుండానే విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించినట్లుగా కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని, రాజకీయ వ్యాఖ్యలు కాకుండా వాస్తవాలను ప్రజల ముందుంచాలని అన్నారు. పదేళ్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ కలిసి పాలన సాగించాయని, ఆ సమయంలో ఇరు పార్టీలకు రాజకీయ సంబంధాలు ఉన్నాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల శాఖ బీజేపీ ఆధీనంలోనే ఉన్నందున కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తే అన్ని విషయాలు స్పష్టమవుతాయని అన్నారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు మాదిరిగానే బండి సంజయ్ కూడా వాస్తవాలను పక్కనపెట్టి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. హరీష్ కు పట్టిన రోగమే బండికి పట్టిందని విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి హోదాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై స్పందిస్తూ, ఆ అంశంపై పీసీసీకి అందజేయాల్సిన నివేదికను వాయిదా వేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు.

తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై రెండు రోజుల పాటు వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించామని చెప్పారు. ఇన్‌చార్జి మంత్రి లక్ష్మణ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సి ఉన్నందున నివేదిక సమర్పణకు మరికొంత సమయం అవసరమైందన్నారు. ఈ నెల 18 లేదా 20వ తేదీలోపు పీసీసీకి పూర్తి నివేదిక అందజేస్తామని తెలిపారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ నాయకులందరూ సమన్వయంతో పనిచేసేలా నిర్ణయం తీసుకుంటామని, రానున్న ఎన్నికల్లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు