జేసీఐ ఇందూర్కు పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు..
నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జేసీఐ) ఇండియా జోన్–12 ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ‘తేజస్ మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్’ లో జేసీఐ నిజామాబాద్ ఇందూర్ వివిధ సేవా కార్యక్రమాల్లో విశేష ప్రతిభ కనబరిచి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను కైవసం చేసుకుంది.
సంక్రాంతి సంబరాలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమాలు, ఉచిత పుస్తకాల పంపిణీ, డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాలు, రక్తదాన శిబిరం, డాన్స్ ఫెస్ట్తో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలకు వివిధ విభాగాల్లో అవార్డులు లభించాయి. ఈ అవార్డులను రీజియన్–సి వైస్ ప్రెసిడెంట్ జయంత్ శెట్టి అందజేశారు.
వ్యక్తిగత అవార్డుల విభాగంలో ఉత్తమ అధ్యక్షుడిగా జైపాల్ కాలే, ఉత్తమ కార్యదర్శిగా తేజస్వి తిరునగరి ఎంపికయ్యారు. సంస్థ అభివృద్ధికి విశేష సేవలు అందించిన పూర్వ అధ్యక్షుడు నయన్ జిల్కార్, పూర్వ జోన్ వైస్ ప్రెసిడెంట్, జేసీఐ సెనేటర్ విజయానంద్ జిల్కార్లకు ప్రత్యేక అవార్డులు ప్రదానం చేశారు.
జేసీఐ ఇందూర్ తరఫున ఈ అవార్డులను జోన్ అధికారి నయన్ జిల్కార్ స్వీకరించారు. కార్యక్రమంలో జేసీఐ ఇందూర్ వైస్ ప్రెసిడెంట్ నిపుణ్, జోన్ అధికారులు, రీజియన్–ఏ, బీ, సీ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అవార్డులు సాధించడంలో సహకరించిన జోన్ అధికారులకు, జేసీఐ ఇందూర్ పూర్వ అధ్యక్షులకు, సభ్యులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో సమాజ సేవలో జేసీఐ ఇందూర్ మరింత ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
