చిన్నారుల చదువుకు ఆధార్తో ఆధారం!
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ చొరవతో ఆసరా
విజయవాడ , ఆంధ్రప్రభ: విజయవాడ పెజ్జోనిపేటకు చెందిన అక్కాచెల్లెళ్లు అన్షిత, అన్విత తల్లిదండ్రులు వేర్వేరుగా ఉండటంతో వారి సంరక్షణ బాధ్యతను అమ్మమ్మ చూస్తున్నారు. ఇటీవల చిన్నారులు అమ్మమ్మతో కలిసి కలెక్టరేట్లో ప్రజా స్నేహపూర్వక పీజీఆర్ఎస్ సందర్భంగా కలెక్టర్ డా. జి.లక్ష్మీశను కలిసి తమకు ఆధార్ కార్డులు లేవని.. ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపై వెంటనే స్పందించిన కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ సూచనతో డీఈవో ఎల్.చంద్రకళ చిన్నారుల ఇంటికెళ్లి వారి స్థితిగతులను తెలుసుకొని బాప్జిస్ట్పాలెం ఎంసీపీఎస్ పాఠశాలలో చేర్పించారు. ఇదిలా ఉంటూనే మరోవైపు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వారి ప్రత్యేక చొరవతో ఆధార్ కార్డులు వచ్చేలా చేశారు. ఈ కార్డులతో పాటు యూనిఫాం, పుస్తకాలను సోమవారం పీజీఆర్ఎస్ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ చిన్నారులకు అందించారు. దీనిపై చిన్నారుల అమ్మమ్మ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యపై వెంటనే స్పందించి మంచి మనసు చాటుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు జిల్లా సమన్వయ అధికారి తదితరులు పాల్గొన్నారు.
