- అగ్రస్థానంలో నిలిచినందుకు పోలీసు శాఖను అభినందించిన సీఎం రేవంత్
అత్యుత్తమ పనితీరుతో దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ అగ్రస్థానంలో నిలిచినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ శాఖ అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల్లో పోలీసింగ్ అంశంలో తెలంగాణ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచినట్లు ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 తేల్చింది.
ఈ నివేదికను టాటా ట్రస్ట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు రూపొందించాయి. ఇందులో తెలంగాణకు గొప్ప గుర్తింపు దక్కడం రాష్ట్ర పోలీసుల కృషికి దక్కిన గౌరవమని, ఈ ఘనత రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం రేవంత్ అన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడం, నేరాలను నియంత్రించడంలో, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసుల నమోదులో పారదర్శకత చూపడం ద్వారా తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో శాంతి, న్యాయం నిలబెట్టడంలో విజయవంతమయ్యారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ పేర్కొన్నారు.
రాజీలేని కర్తవ్య నిర్వహణతో పోలీసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచారని, ప్రజా పాలనలో ఈ విజయం పోలీసు శాఖ సమిష్టి కృషి ఫలితమని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో తెలంగాణ పోలీసులు ఇలాంటి మరిన్ని విజయాలను సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

