Mysore రెస్టోపబ్లో విషాదం..
Mysore రెస్టోపబ్లో విషాదం..
- అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి
- ఇద్దరు మృతి.. యజమానితో సహా ఐదుగురికి గాయాలు
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : కర్ణాటకలోని మైసూరు(Mysore)లో సోమవారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ రెస్టోపబ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, యజమానితో సహా పలువురు గాయపడ్డారు. మృతులను పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్కు చెందిన సాహిన్ (26), నేపాల్కు చెందిన ప్రకాశ్ (24)గా గుర్తించారు. ప్రమాద సమయంలో వారు పబ్లో ఉండగా మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో గాయపడిన వారిలో కస్టమర్లు సోను, రమేష్, మహదేవ్ ప్రసాద్, ప్రజ్వల్, అవినాష్తో పాటు పబ్ యజమాని ప్రీతమ్ పుమీత్ ఉన్నారు. వీరిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విద్యుత్ షార్ట్సర్క్యూట్ లేదా ఇతర కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
