ఇస్నాపూర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని నీలం మధు వినతి
ఇస్నాపూర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని నీలం మధు వినతి
ఇస్నాపూర్, ఆంధ్రప్రభ: పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీని ప్రత్యేకంగా పరిగణించి అభివృద్ధి కోసం అదనపు నిధులు కేటాయించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామిని ఇస్నాపూర్ చౌరస్తాలో నీలం మధు ముదిరాజ్, మున్సిపల్ కౌన్సిలర్లు కలిసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించిన వినతిపత్రాన్ని మంత్రి వద్ద సమర్పించారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ 329 కాలనీ, ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీల్లో రహదారులు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ స్తంభాలు, ఇంటి నంబర్లు, విద్యుత్ మీటర్ల వంటి మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. అలాగే నేషనల్ హైవే నుంచి లక్డారం–బ్యాతోల్–రుద్రారం–ఎర్థనూర్ వరకు రహదారి అభివృద్ధి చేసి ఇరు వైపులా ఐమాక్స్ లైటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే రూ.15 కోట్ల నిధులతో పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం అదనపు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.
