TDP Mahanadu | రిటర్న్ గిఫ్టే టార్గెట్! పూర్వ వైభవంపైనే దృష్టి

ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్ : తెలుగుదేశం వల్లభుడు దివంగత ఎన్టీఆర్ కేవలం కడప జిల్లా కాదు.. యావత్ ఆంధ్రా ప్రజానీకానికి అత్యంత ప్రీతిపాత్రుడే. కానీ ఆయన అత్యంత ఆకర్షణతో జనంలో మమేకమైనప్పటికీ.. కడప జిల్లాలో పులివెందులలో టీడీపీ సైకిల్ నడవలేదు. ఎందుకంటే కడప జిల్లా అంటేనే, వైఎస్ రాజశేఖరరెడ్డి ఫ్యామిలీగా మారిపోయింది. వైఎస్‌ఆర్ మరణానంతరం కడప జిల్లా వైఎస్సార్ అడ్డాగానే జనం భావించారు. ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి ఇదే పట్టును కొనసాగించారు. కానీ.. మూడు నియోజకవర్గాలకే వైఎస్ఆర్ చరిష్మా పరిమితమైంది. ఈ స్థితిలో పులివెందులను సైతం కైవసం చేసుకుని అప్రతిహాతంగా కడప జిల్లాలో పసుపు జెండా ఎగురవేయటమే ప్రస్తుతం టీడీపీ అజెండా. అందుకే ఏరికోరి కడప జిల్లానే వేదికగా ఏర్పాటు చేసుకున్నారు. 2004 నుంచి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ కోలుకోలేని దెబ్బలు తింటోంది. ప్రతి ఎలక్షన్‌లోనూ ఒకటి రెండు సీట్లకే టీడీపీ పరిమితమైంది. 2019లో మొత్తం 10 స్థానాలను వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయినట్టే తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో కూడా ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరంగా తుడిచిపెట్టుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించిన అయిదేళ్ల కాలంలో కడప జిల్లాలో తమ బలం పెంచుకోవడానికి టీడీపీ పడిన కష్టం కూడా అంతగా లేదు. కడపలో సీట్లను గెలవటం కష్టమేనని భావించింది. కానీ 2024 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో ఎన్డీయే కూటమి ఏకంగా పదిలో ఏడు సీట్లు గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీకి అయిదు సీట్లు లభించాయి. ఇక వైఎస్ జగన్ జమానాకు గండిపడినట్టే.. అందుకే తమను ఆదరించిన కడప జిల్లాలో మరింతగా పాగా వేయడానికి ఈ మహానాడును ఇక్కడ నిర్వహించాలని సంకల్పించారు.

కడప గడ్డలో టీడీపీ స్థితి గతి
1983లో అసెంబ్లీ ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ సైకిల్ దూసుకు పోయింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 201స్థానాల్లో గెలిచింది. గెలిచిన అభ్యర్థులందరూ రాజకీయాలకు కొత్త ముఖాలే. కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఓడిపోయారు. కానీ కడపలో 11 అసెంబ్లీ స్థానాల్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలిచారు. రాజంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి కొందూరు ప్రభావతమ్మ, రాయచోటిలో స్వతంత్ర అభ్యర్థి పాలకొండరాయుడు, బద్వేలులో కాంగ్రెస్ అభ్యర్థి బిజివేముల వీరారెడ్డి.. మైదుకూరులో డీఎల్ రవీంద్ర రెడ్డి, పులివెందులలో వైఎస్ రాజశేఖరరెడ్డి గెలిచారు. ఎన్టీఆర్ హవాలోనూ కడపలో కాంగ్రెస్ పట్టు కోల్పోలేదు. ఇక 1985లో 202 స్థానాల్లో టీడీపీ గెలిస్తే కడప జిల్లాలో మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. రాయచోటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మండిపల్లి నాగిరెడ్డి, కమలాపురం నుంచి ఎంవీ మైసూరారెడ్డి, పులివెందుల నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి గెలిచారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 181 స్థానాల్లో గెలిచింది. రైల్వే కోడూరులో టీడీపీ అభ్యర్థి తూమాటి పెంచయ్య, జమ్మలమడుగులో టీడీపీ అభ్యర్థి పొన్నపురెడ్డి శివారెడ్డి గెలిచారు. ఈ ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాలకే పరిమితమైంది. 1994లో 216 సీట్లల్లో గెలిచిన టీడీపీ విజృంభించింది. కాంగ్రెస్ పార్టీకి నాలుగు స్థానాలే దక్కాయి. రాయచోటి నుంచి ఎం.నారాయణ రెడ్డి, మైదకూరు నుంచి డీఎల్ రవీంద్ర రెడ్డి, ప్రొద్దుటూరు నుంచి వరదరాజుల రెడ్డి, పులివెందుల నుంచి వైఎస్ రాజశేఖరెడ్డి గెలిచారు. 1999 ఎన్నికల్లో 8 స్థానాల్లో టీడీపీ, ప్రొద్దుటూరు, పులివెందుల, కమలాపురం స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.

టీడీపీ పతనం షురూ..
2004లో 11 సీట్లల్లో టీడీపీకి కేవలం రెండు సీట్లు దక్కాయి. కమలాపురం నుంచి టీడీపీ అభ్యర్థి జీ.వీరశివారెడ్డి, రాయచోటి నుంచి సుగవాసి పాలకొండ రాయుడు గెలిచారు. 2009లో 10 సీట్లుకు టీడీపీకి ఒకే ఒక సీటు దక్కింది .
ప్రొద్దుటూరు నుంచి మల్లెల లింగారెడ్డి గెలిచారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కానీ కడప జిల్లాలో 10 స్థానాల్లో టీడీపీకి రాజంపేట దక్కింది. ఇక్కడ నుంచి మేడ వెంకట మల్లికార్జున రెడ్డి గెలిచారు. 2019లో టీడీపీ గల్లంతు కాగా.. 2024లో ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కోలుకుంది. అన్నమయ్య జిల్లాలోని ఆరు స్థానాల్లో రెండు స్థానాల్లోనే వైసీపీ గెలిచింది. రాయచోటి నుంచి ప్రస్తుత రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్, రైల్వే కోడూరు నుంచి జనసేన నేత ఎస్సీ ఆరవ శ్రీధర్, రాజంపేట నుంచి వైసీపీ నేత ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి, పీలేరు నుంచి టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లి నుంచి టీడీపీ అభ్యర్థి షాజాహాన్ బాషా, తంబళ్లపల్లి నుంచి వైసీపీ నేత పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గెలిచారు. కడప జిల్లాలో 7 స్థానాలు.. 5 టీడీపీ కైవసం చేసుకోగా.. కేవలం కడప నుంచి టీడీపీ అభ్యర్థిని రెడ్డిప్పగారి మాధవి, కమలాపురం నుంచి పీ కృష్ణ చైతన్య రెడ్డి , ప్రొద్దుటూరు నుంచి వరదరాజుల రెడ్డి , మైదకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, జమ్మలమడుగు నుంచి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి, బద్వేలు వైసీపీ నేత దాసరి సుధ . పులివెందుల నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలిచారు.

కింకర్తవ్యం
కడప జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ప్రజలు తమను విశ్వసించడం ఏదో గాలివాటుగా జరిగినది కాదని.. తమను జనం విశ్వసించారని నిరూపించుకోవడమే చంద్రబాబు బాధ్యత. ఇప్పుడు అధికారంలోకి ఉన్న సమయంలో ఆయన ఆ జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వాసులకు ఎలాంటి వరాలు ప్రకటిస్తారు. కడప జిల్లాలో తరతరాల వైఎస్ ఆర్ ఆధిపత్యానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఏ రీతిలో చరమాంకం పలుకుతారనే అంశంపైనే యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *