Rs-39-crore: అయ్యో.. ‘చంద్రవంక’ Andhra Prabha Exclusive Story

Rs-39-crore: అయ్యో.. ‘చంద్రవంక’ Andhra Prabha Exclusive Story

  • 70 ఏళ్ల ముంపు బెడ‌ద‌
  • 3 సార్లు జలదిగ్బంధం..
  • వీడ‌ని ఆధునీకీకరణ గ్ర‌హ‌ణం
  • రూ.39 కోట్లకు చేరిన అంచ‌నా

( మాచర్ల, ఆంధ్రప్రభ ):

​పల్నాటి పౌరుషానికి ప్రతీకగా, ఘనమైన చారిత్రక వారసత్వానికి సాక్ష్యంగా నిలిచే మాచర్ల పట్టణాన్ని వర్షాకాలం వచ్చిందంటే చాలు ముంపు భయం వెంటాడుతోంది. ఏళ్లు గడుస్తున్నా పరిష్కారానికి నోచుకోని ‘చంద్రవంక వాగు’ ఉధృతితో స్థానిక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు.

Rs-39-crore: ఇందుకే ​ముంపు

​ఎగువ ప్రాంతాల వరద ఉధృతి: వెల్దుర్తి, దుర్గి మండలాల్లోని కొండ ప్రాంతాల నుంచి ప్రవహించే వర్షపు నీరు ఆత్మకూరు చెరువుకు చేరి, అక్కడి నుంచి నేరుగా మాచర్ల పట్టణ మధ్యలో పారే చంద్రవంక వాగులోకి ప్రవేశిస్తుంది.

​Rs-39-crore: బలహీన కట్టలు

ఆత్మకూరు చెరువు నుండి ఎత్తిపోతల జలపాతం వరకు 20 కి.మీ దూరం ఉండగా, పట్టణంలో ప్రవహించే 2 కి.మీ పరిధిలో వాగు కట్టలు బాగా కోతకు గురయ్యాయి. గుర్రపుడెక్క, ముళ్లపొదలు పేరుకుపోవడంతో నీటి ప్రవాహ వేగానికి అడ్డంకిగా మారాయి.

​Rs-39-crore: ఇక నీరు పార‌దు

ప్రవాహం వేగంగా ఎత్తిపోతల జలపాతం చేరి అటునుంచి కృష్ణా నదిలోకి వెళ్లాలి. అయితే నీరు ప్రవహించే దారి లేకపోవడంతో బలహీనమైన కట్టల గుండా పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లోకి చొరబడుతోంది. ​పట్టణ పరిధిలోని పిడబ్ల్యూడి కాలనీ, రైల్వే స్టేషన్ ప్రాంతం, పురాతన చెన్నకేశవస్వామి దేవాలయ ప్రాంగణం, అజాద్ నగర్, వినాయకుని గుట్ట, నెహ్రూ నగర్ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునుగుతాయి. చెన్నకేశవస్వామి గుడి వద్ద ఉన్న లో-లెవెల్ వంతెన పైనుంచి ప్రవాహం పొంగిపొర్లుతుండటంతో లింగాపురం, జమ్మలమడక, తుమ్రుకోట, పాలవాయి గ్రామాలకు రాకపోకలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి.

Rs-39-crore: అంచనాలు పై పైకి :

2008 నాటికి 12కోట్లగా ఉన్న ఆధునీకరణ అంచనాలు ప్రస్తుతం 39 కోట్లకు చేరింది. పట్టణ పరిధిలోని రెండు కిలోమీటర్ల వాగుకు ఇరువైపులా సిమెంట్ కాంక్రిట్ లైనింగ్, కట్టల ఎత్తు పెంపుతో ప్రమాదం నుండి గట్టెక్కే అవకాశం ఉంది. తాత్కాలికంగా మైనర్ ఇరిగేషన్, మున్సిపాలిటీ నిధులతో ముళ్లపొదలను తొలగిస్తున్నప్పటికి మళ్ళీ పెరిగి సమస్య మొదటికే వస్తుంది. 70 వేలమంది పట్టణ ప్రజల భయాలు తొలగాలంటే తక్షణమే ప్రభుత్వం పెరిగిన అంచనాల ప్రకారం 39 కోట్ల నిధులను మంజూరు చేసి చంద్రవంక వాగును శాశ్వతంగా ఆధునీకరించాలని స్థానికులు కోరుతున్నారు. మాచ‌ర్ల పట్టణంలో వరద ముప్పు లేకుండా రెండు కిలోమీటర్లు మేర ఇరువైపులా చంద్రవంక ఆధునీకరణ పనుల కోసం 39 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం అత్యవసర పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం – వెంకటేశ్వర రావు, ఏఈఈ మైనర్ ఇరిగేషన్ శాఖ