నిండు జీవితానికి రెండు చుక్కలు..
పల్స్ పోలియోపై అవగాహన కల్పించిన బద్దం శ్రీనివాస్
ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపు
మెండోరా, ఆంధ్రప్రభ: మెండోరా మండలంలోని వెల్గటూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పిర్దోస్ ఫాతిమా ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బద్దం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బద్దం శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి కుటుంబం పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు ఉన్న చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.
“రెండు చుక్కలు.. పిల్లల జీవితానికి బంగారు బాటలు” అని పేర్కొంటూ, పోలియో చుక్కల ద్వారా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి, భవిష్యత్తులో అంగవైకల్యం బారిన పడకుండా రక్షణ లభిస్తుందని తెలిపారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
