మెలియోయిడోసిస్ వ్యాధి వ్యాప్తే మరణాలకు కారణం

మెలియోయిడోసిస్ వ్యాధి వ్యాప్తే మరణాలకు కారణం
- గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
- మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున సాయం
గుంటూరు, ఆంధ్రప్రభ: గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మెలియోయిడోసిస్ వ్యాధి వ్యాప్తితోనే మరణాలు సంభవించాయని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలియకుండా వ్యాధి వ్యాప్తి జరిగిందని ఇది దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. తురకపాలెంలో వ్యాధి కారణంగా మరణించిన ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున టీటీపీ ప్రభుత్వం అందజేసిన నగదు సాయాన్ని ఆయన ఆదివారం స్థానిక ఎమ్మెల్యే బి. రామాంజనేయులు, కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి బాధిత కుటుంబాలకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ ప్రాంతంలో బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షించేందుకు వైద్య నిపుణులను తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం తరఫునుంచి బెడ్స్, వాటర్, మెడిసిన్స్ అని సౌకర్యాలు ఏర్పాటు చేసామని తెలిపారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ తురకపాలెం తరహాలో అనారోగ్యాలు ప్రబలినప్పుడు కంటికి రెప్పలా ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం అందరి పైన ఉందన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు , డీఎంహెచ్ఓ డా. విజయలక్ష్మి , తహసిల్దార్ వెంకటేశ్వరరావు, నియోజకవర్గ అబ్జర్వర్ వందనాదేవి, ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


