భారీ వర్షాలకు ప్రజలు బయటకి రావొద్దు

అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్
అచ్చంపేట, ఆంధ్రప్రభ : తుఫాను ప్రభావంతో 24 గంటలుగా అచ్చంపేట సబ్డివిజన్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. గ్రామాలలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని తెలిపారు. అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. పాత మట్టి ఇళ్లలో నివసిస్తున్న వారు వెంటనే వాటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆయన సూచించారు.
అచ్చంపేట నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులు మీదుగా వరద ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ దారిలో వాహనదారులు వెళ్లొద్దని డీఎస్పీ హెచ్చరించారు. ప్రజల రక్షణార్థం సబ్డివిజన్ పరిధిలోని పోలీసులు ఎప్పటికప్పుడు పహారా కాస్తున్నారని, ఎవరైనా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా వెంటనే తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
