హైదరాబాద్ : దేశంలో రూ.16 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు అప్పు ఇస్తే ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లారని, కానీ ఆడబిడ్డలకు అప్పు ఇస్తే.. ఒక్క రూపాయి ఎగ్గొట్టకుండా వడ్డీతో సహా చెల్లిస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్ధిక క్రమశిక్షణ తమ ఆడబిడ్డల సొంతం అని అన్నారు. ఫిల్మ్ నగర్ లోని జెఆర్సీ కన్వెన్షస్ సెంటర్ లో ఇవాళ జరిగిన వి హబ్ విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఇప్పటికే వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని మహిళలకు అప్పగించామని అంటూ వారు సమర్ధవంతంగా నిర్వహిస్తే అవసరమైతే మరో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
దేశాన్ని గెలిపించిన శక్తి మహిళా శక్తిదని రేవంత్ ప్రశంసించారు. ఇండియా, చైనా యుద్ధం జరిగినపుడు, 1971లో పాకిస్థాన్తో యుద్ధం జరిగిన సమయంలో ఇందిరమ్మ మహిళా శక్తిని ప్రపంచానికి చాటారని గుర్తుచేశారు. మహిళా శక్తిని కాంగ్రెస్ ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదని చెప్పారు. మహిళా శక్తి దేశానికి అండ అని నిరూపించిన ఘనత కాంగ్రెస్దని ఉద్ఘాటించారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తికి చేయూతనిచ్చే చాలా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి మహిళలకు ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ నజరానా అందించారని గుర్తుచేశారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ఆడబిడ్డలకు అప్పగించామని సీఎం తెలిపారు.

ఇక స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేసిన వాటినే రాష్ట్రానికి వచ్చే అతిథులకు బహుమతులుగా అందిస్తున్నామని గుర్తు చేశారు. ఆడబిడ్డలను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ విధానమన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం’అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
దేశానికి మహిళలు ఆదర్శం…
‘విద్యార్థుల యునిఫార్మ్ కుట్టుపనిని మహిళా సంఘాలకు అప్పగించి వారికి భరోసా కల్పించామని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. వ్యాపారంలో మహిళలను ప్రోత్సహిస్తున్నామని పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాలు వారికే అప్పగిస్తున్నామన్నారు.. అదానీ, అంబానీలకు పరిమితమైన వ్యాపారాలను మహిళలు చేసేలా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. శిల్పారామంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనకు స్టాల్స్ను కేటాయించామని వెల్లడించారు.. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని తాను నమ్ముతున్నానని అన్నారు.