- వరుస ఓటములతో డీలా పడ్డ హైదరాబాద్..
ఐపీఎల్ ఈరోజు జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో మరోసారి సన్రైజర్స్ను మట్టికరిపించిన కేకేఆర్.. 80 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎస్ఆర్హెచ్.. కోల్కతా బౌలర్ల ధాటికి 120 పరుగులకే పరిమితం అయ్యింది. కేకేఆర్ అటు బ్యాటింగ్, బౌలింగ్లో రాణించగా… హైదరాబాద్ మాత్రం రెండు విభాగాల్లోనూ విఫలమైంది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లు తీయగా.. ఆడ్రీ రసూల్ రెండు వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా, సునీల్ నరైన్ చెరో వికెట్ తీశారు.
భారీ ఛేదనలో హైదరబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టాపార్డర్ పూర్తిగా విఫలమవ్వగా.. కమిండు మెండిస్ (27), హెన్రిచ్ క్లాసెన్ (33) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు సాధించారు. వీరు మినహా మరో బ్యాటర్ అంతగా రాణించలేదు. దీంతో ఎస్ఆర్హెచ్ మరో ఓటమి తప్పలేదు.
అంతకముందు బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా చెలరేగి ఆడింది. 15 ఓవర్లకు 122 పరుగులు ఉండగా.. 20 ఓవర్లకు 200 బాదారు. యంగ్ స్టార్ అంగ్క్రిష్ రఘువంశీ (50), వెంటేష్ అయ్యార్ (60) హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. కెప్టెన్ అజింక్యా రహనే (38), రింకూ సింగ్ (32) దంచికొట్టారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో మహ్మద్ షమీ, ప్యాట్ కమ్మిన్స్, జీషాన్, హర్షల్ పటేల్, కామిందు మెండిస్ తలా ఒక వికెట్ తీశారు.
ఈ ఓటమితో సన్రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 8వ స్థానం నుండి చివరి స్థానానికి పడిపోయింది. మరోవైపు, అట్టడుగున ఉన్న కేకేఆర్ ఐదు స్థానాలు ఎగబాకి 5వ స్థానానికి చేరుకుంది.