అనంతపురం నగరంలోని కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల వసతిగృహంలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. ఈ ఘటనలో పది మంది విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని బయటకు రాకుండా ప్రిన్సిపాల్ గోప్యంగా ఉంచారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థినులకు గోప్యంగా వ్యాక్సిన్ వేయించారు. విద్యార్థినులు నిద్రిస్తున్నప్పుడు ఎలుకలు కొరికాయి. హాస్టల్ చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణ వల్ల రూమ్ లోకి ఎలుకలు వస్తున్నాయని విద్యార్థినులు వాపోతున్నారు.
నిర్మాణంలో ఉన్న హాస్టల్ భవనంలో ఎలుకల బెడద ఉందని చెబుతున్నారు. కాగా, విద్యార్థినులు బయట నుంచి స్నాక్స్ తీసుకొస్తుండటంతోనే ఎలుకలు వస్తున్నాయని కాలేజీ ప్రిన్సిపల్ సత్యలత, వార్డెన్ సౌగంధిక తెలిపారు. ఎలుకల బెడదను నివారించేందుకు హాస్టల్ రూమ్లు, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించామని కాలేజీ యాజమాన్యం పేర్కొంది.