TG | ఆ వార్తల్లో నిజం లేదు.. అధికారుల క్లారిటీ

నాగ‌ర్ క‌ర్నూల్ : ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ సంతోష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నేడు (శుక్రవారం) జేపీ బేస్ క్యాంప్ ఆఫీస్ లో సహాయక బృందాల అధికారులతో జిల్లా కలెక్టర్.. ఎస్పీ వైభవ్ ర‌ఘునాత్ గైక్వాడ్, ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎన్ డి ఆర్ ఎఫ్ అధికారి సుఖేండు, టిఎస్ఎస్పీడీసీఎల్ సిఎండి ముషరఫ్ ఆలీ, ఆర్మీ అధికారులు కల్నల్ పరీక్షిత్ మెహ్ర, కల్నల్ అమిత్ కుమార్ గుప్తా, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారి బలరాం, హైడ్రా అధికారులు, జేపీ కంపెనీ ప్రతినిధులతో టన్నెల్ కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..

సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వైద్య సిబ్బంది ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచారని తెలిపారు. ఎస్‌ఎల్‌బిసి సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు 12 బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయన్నారు.

ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ఫైర్ సర్వీసెస్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, హైడ్రా, సౌత్ సెంట్రల్ రైల్వే ప్లాస్మా కట్టర్లు, ర్యాట్ మైనర్ల బృందాలు నిరంతర సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతం చేసినట్లు వివరించారు.

ప్రమాద ప్రదేశంలో కొనసాగుతున్న సహాయక చర్యలను వేగవంతం చేసేలా సహాయక బృందాలను నిరంతరం పనిచేసేలా పక్కా ప్రణాళికతో సహాయక చర్యలకు కావలసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ… ప్రమాద ప్రదేశంలోని నీటిని పంపుల ద్వారా బయటికి తరలిస్తూ, ప్లాస్మా గ్యాస్ కట్టల ద్వారా శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేసినట్లు వివరించారు.

సహాయక చర్యలు కావలసిన సామాగ్రిని అందుబాటులో ఉంచుకుంటూ వీలైనంత త్వరగా కన్వేయర్ బెల్ట్ ను ఉపయోగంలోకి తీసుకురానున్నట్లు, బురదను తీసి వేసేందుకు కావలసిన ఎస్కావేటర్లను సిద్ధం చేసినట్లు వివరించారు. ప్రత్యేక కెమేరాలు, సెన్సార్ల ద్వారా లోపలి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడం వంటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *