స్వాతంత్ర్య స్ఫూర్తికి మూలం వందేమాతరం

  • జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : స్వాతంత్ర్య స్ఫూర్తికి మూలం వందేమాతరం, మన ఐక్యతకు ప్రతీక వందేమాతరం అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, శుక్రవారం భీమవరం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో వందేమాతర గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొని దేశభక్తి గీతం వందేమాతరంను ఏకస్వరంగా ఆలపించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ.. వందేమాతరం అనేది కేవలం ఒక గీతం కాదు, అది భారతీయుల మనసుల్లో దేశభక్తిని మేల్కొలిపిన ఆత్మీయ నినాదం అని అన్నారు. బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్లాది భారతీయులలో ఆత్మవిశ్వాసాన్ని, త్యాగస్ఫూర్తిని నింపిందన్నారు. వందేమాతరం అనేది మన దేశం పట్ల గల గౌరవం, ప్రేమ, సేవాస్ఫూర్తికి ప్రతీక అని వివరించారు.

ఈ రోజు విద్యార్థులు, అధికారులు, పోలీసులు, ప్రజలు ఒకే గళంలో ఆలపించడం ద్వారా మన దేశ ఏకత, ఐకమత్యం ప్రతిబింబించింది అన్నారు. ప్రతి భారతీయుడు ఈ గీతం యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకుని దేశసేవలో భాగస్వామిగా మారాలన్నారు.

వందేమాతరం పాడినప్పుడు మన హృదయం గర్వంతో నిండాలి, ఎందుకంటే అది మన భారతీయతకు ప్రతీక అని కలెక్టర్ చెప్పారు. బంకిమ్ చంద్ర చటర్జీ ఇచ్చిన స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ దేశ ఐక్యత కోసం మనమందరం కలిసి నడవాలని ఆమె పిలుపునిచ్చారు.

భీమవరం శాసనసభ్యులు, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ… స్వాతంత్ర్య ఉద్యమకారుల్లో పోరాట స్ఫూర్తిని రగిలించిన గీతం వందేమాతరం. నవంబర్ 7, 2025 నాటికి ఈ గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మనమంతా కలిసి పూర్తి గేయాన్ని పాడి దేశభక్తిని గర్వంగా చాటుకుందాం అని అన్నారు.

జాతీయ సమైక్యత భావం – ఎస్పీ అద్నాన్ నయీం అస్మి

జాతీయ సమైక్యత భావంతో దేశ ప్రజల్లో శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో బంకిమ్ చంద్ర చటర్జీ వందేమాతరం గీతాన్ని రచించారని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు.

వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వందేమాతరం, జనగణమన గీతాలు భారతీయతను ప్రతిబింబిస్తూ, దేశ ప్రజల్లో ఐక్యతా స్ఫూర్తిని నింపుతున్నాయి. ఈ గీతాలు మనలో దేశాభిమానాన్ని మేల్కొలిపే శక్తిగా నిలుస్తాయి అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఆర్డీవో ప్రవీణ్‌కుమార్ రెడ్డి, డీఈవో ఇ. నారాయణ, డిఎంహెచ్వో డా. బి. గీతాబాయి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు. మంగపతిరావు, జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకనలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ అధికారి అరుణకుమారి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పుష్పరాణి, తహసీల్దార్ రావి రాంబాబు పాల్గొన్నారు.

అలాగే టీడీపీ నాయకులు మెంటే పార్ధసారధి, కోళ్ల నాగేశ్వరరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ చెనమల్ల చంద్రశేఖర్, ఎఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, స్థానిక నాయకులు వబిలిశెట్టి రామకృష్ణ, యారంశెట్టి శివకృష్ణ, ఇందుకూరి రామలింగరాజు, గనిరెడ్డి త్రినాథ్, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, కారుమూరి సత్యనారాయణమూర్తి, పీఎస్ఎం బాలికొన్నత పాఠశాల విద్యార్థులు, కూటమి నాయకులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply