హైదరాబాద్ : ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద జులై 1 వ తేదీన నిర్వహించే అమ్మవారి కళ్యాణం ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఆలయ ట్రస్ట్ చైర్మన్ సాయిబాబా గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) మాట్లాడుతూ…. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తుల పూజలు అందుకుంటున్న అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికావద్దనే ఆలోచన తో ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్లు వివరించారు. ఆలయాన్ని పుణ్యక్షేత్రం మాదిరిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ఆలయం చుట్టూ అద్భుతమైన రోడ్లు, ఆలయం ముందు, పక్కన దాతల సహకారంతో భారీ రేకుల షెడ్లు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎంతో మహిమ గల అమ్మవారి కళ్యాణం వీక్షించేందుకు నగరం నుండే కాకుండా రాష్ట్రంలో ని ఇతర ప్రాంతాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిపారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమ్మవారి కళ్యాణం నిర్వహణకు ప్రత్యేకంగా ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయలను కేటాయిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎంతో గొప్పగా నిర్వహించే అమ్మవారి కళ్యాణంలో పార్టీలకు అతీతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జోగినీలు, శివసత్తులకు దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు. కళ్యాణం తర్వాతి రోజు 2 వ తేదీన నిర్వహించే రధోత్సవంలో ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దని పోలీసు అధికారులను ఆదేశించారు.