TG | ప్రతీ ఇంటికి సరిపడా నీరందిస్తాం : బండి సంజయ్

చొప్పదండి, జూన్ 9 (ఆంధ్రప్రభ): ప్రతీ ఇంటికి.. ప్రతీ వ్యక్తికి సరిపడా నీరందించే దిశగా అమృత్- 2 పథకాన్ని (Amrit-2 scheme) అమలు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని నల్లాల బావి వద్ద రూ.36.3కోట్ల వ్యయంతో వాటర్ ఇంప్రూవ్ మెంట్ స్కీంకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు.

ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… చొప్పదండి మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికీ సరిపడా నీళ్లను అందించాలనే లక్ష్యంతో అమృత్ 2 పథకం కింద 36కోట్ల 30లక్షల రూపాయల నిధులతో పైప్ లైన్, వాటర్ సంప్ ఇతర పనులను చేపట్టేందుకు పనులను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 2015 జూన్ 25న ప్రారంభమైన అమృత్ 1 పథకం (Amrit-1 scheme) కింద 2015-16 నుండి 2019-20 వరకు కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఖర్చు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. అమృత్ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1 కోటి 34 లక్షల నీటి కనెక్షన్లు అందించామన్నారు. 1 కోటి 2 లక్షల మురుగునీటి కనెక్షన్లు అందించామన్నారు. వీటితో పాటు 2 వేల 411 పార్కులను అభివృద్ధి చేశామని, 62 లక్షల 78 వేల ఎల్ఈడీ లైట్లను అమర్చామన్నారు.

2021లో అమృత్ 2.0 పథకం ప్రారంభమై ఐదేళ్ల పాటు (five years) ఈ పథకం అమలులో ఉంటుందన్నారు. ఈ స్కీం కింద కేంద్ర, రాష్ట్రాలు, మున్సిపాలిటీల భాగస్వామ్యంతో ఈసారి 2 లక్షల 99 వేల కోట్ల రూపాయల ఖర్చు చేయాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇందులో కేంద్ర వాటా కింద 76 వేల 760 కోట్ల రూపాయలను కేటాయించబోతున్నామని, మిగిలిన మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు, నగర పాలక సంస్థలు సమీకరించుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో అమృత్ 1, అమృత్ 2.0 కింద మొత్తం 6 వేల 876 కోట్లు ఖర్చు చేయబోతున్నామని, కేంద్ర వాటా 3 వేల 591 కోట్ల 72 లక్షల రూపాయలు ఉండగా, రాష్ట్ర వాటా కింద 2 వేల 614 కోట్ల 82 లక్షల రూపాయలు ఉందన్నారు. ఎంపిక చేయబడిన మున్సిపాలిటీల వాటా 669 కోట్ల 85లక్షల రూపాయలు ఉండగా, అమృత్ 1 కింద 1153 కోట్లు, అమృత్ 2 కింద 2438 కోట్ల రూపాయలను మోదీ ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఉమ్మడి కరీంనగర్ ( Karimnagar) జిల్లా విషయానికొస్తే అమృత్ 1, అమృత్ 2 కింద మొత్తం 852 కోట్ల 11 లక్షల రూపాయలు కేటాయించామన్నారు.

ఇందులో కేంద్ర వాటా 481 కోట్ల 19 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 297 కోట్ల 55 లక్షలు, మున్సిపాలిటీల వాటా 73 కోట్ల 37 లక్షలుగా ఉందన్నారు. చొప్పదండి (Choppadandi) మున్సిపాలిటీలో అమృత్ 2 కింద 36 కోట్ల 30 లక్షల రూపాయల నిధులతో ఇంటింటికీ నీళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో కేంద్ర ప్రభుత్వం 17 కోట్ల 89 లక్షలు, రాష్ట్రం వాటా 15 కోట్ల 11 లక్షలు, మున్సిపాలిటీ వాటా 3 కోట్ల 30 లక్షలు ఉందన్నారు. దేశంలో 40 శాతం జనాభా పట్టణాల్లోనే నివసిస్తోందని, 2047 నాటికి ఈ సంఖ్య 50 శాతం కంటే ఎక్కువ కాబోతోందన్నారు. ప్రధాని మోదీ ఎంతో దూరదృష్టితో నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రతి ఇంటికీ సరిపడా నీటిని అందించంతోపాటు డ్రైనేజీ సౌకర్యం కల్పించి నీటి భద్రతా నగరాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అమృత్ పథకాన్ని ప్రారంభించిందన్నారు.

చొప్పదండిలో ఎప్పుడో ఈ స్కీంను మొదలు పెట్టాల్సి ఉన్నా గత ప్రభుత్వం సం వాకరించక పోవడం వల్ల నిలిచి పోయిందన్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి పథకం పనులకు శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ పనులను పూర్తి చేసి చొప్పదండి ప్రజలకు ఇంటింటికీ సరిపడా నీళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీంతోపాటు సీఆర్ఎఫ్, ఎన్ఆర్ఈజీఎస్ (CRF, NREGS) నిధులతో రోడ్లను నిర్మిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *