అటవీ సిబ్బందికి రూ.3 వేల నగదు పురస్కారం
జన్నారం, ఆంధ్రప్రభ: విధి నిర్వహణలో ధైర్యసాహసాలు, ఉత్తమ సేవలు అందించిన కవ్వాల పులుల అభయారణ్య సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నగదు పురస్కారాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. మంచిర్యాల అటవీ సంరక్షణాధికారి, కవ్వాల పులుల అభయారణ్య క్షేత్ర సంచాలకుడు శాంతారాం చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందజేశారు.
జన్నారం అటవీ విభాగంలోని బేస్ క్యాంప్, జంతు అన్వేషకులు ఎస్. రాజన్న, ఎన్. లక్ష్మణ్లకు రూ.3 వేల చొప్పున నగదు పురస్కారం, ప్రశంసాపత్రాలు అందించారు. తాళ్లపేట, జన్నారం అటవీ ప్రాంతాల్లో పనిచేస్తున్న డిప్యూటీ రేంజ్ అధికారి పి. మమత, కృష్ణారావు, రహిమొద్దీన్, కార్యాలయ సిబ్బంది క్రాంతి, వసిల్, దుర్గయ్య, బి. సుమన్, ఎ. సురేష్లకు కూడా నగదు పురస్కారాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. అటవీ సిబ్బంది సేవలను గుర్తించి పురస్కారాలు అందించడం అభినందనీయమని స్థానిక అటవీ అధికారులు తెలిపారు.
