నీట్ లాంగ్టర్మ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..
నడిగూడెం, ఆంధ్రప్రభ : 2026-27 విద్యా సంవత్సరానికి గాను సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నీట్ లాంగ్టర్మ్ శిక్షణకు అర్హులైన విద్యార్థినీ, విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయ అధికారి (డీసీఓ) సీహెచ్. పద్మ తెలిపారు.
హైదరాబాద్లోని టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ ఫౌండేషన్ సీఈఓలో బాలురకు 100 మందికి, మహేంద్ర హిల్స్ ఫౌండేషన్ సీఈఓలో బాలికలకు 100 మందికి నీట్ శిక్షణ అందించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
2025-26 విద్యా సంవత్సరంలో బైపీసీ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థినీ, విద్యార్థులు ఈ నెల 22వ తేదీలోపు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. వెబ్సైట్లో దరఖాస్తు పూర్తి చేసిన అనంతరం అవసరమైన అన్ని ధ్రువపత్రాలను జతచేసి, నిర్దేశించిన సమయంలో డీసీఓలకు అందజేయాలని కోరారు. సొసైటీ వెబ్సైట్లో దరఖాస్తు వివరాలు అందుబాటులో ఉంటాయని డీసీఓ పద్మ తెలిపారు.
