ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా అర్జీల పరిష్కారం
సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
జిల్లాస్థాయి ప్రజా స్నేహపూర్వక పీజీఆర్ఎస్కు 237 అర్జీలు
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న అర్జీలను సకాలంలో నాణ్యతతో పరిష్కరించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం తదితరులతో కలిసి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 237 అర్జీలు అందాయి.
వీటిలో రెవెన్యూ సేవలకు సంబంధించి 70, పురపాలక-పట్టణాభివృద్ధికి సంబంధించి 62, పోలీసు 26, పంచాయతీరాజ్ 22, జల వనరులు 13, విద్యుత్ 9, వైద్యారోగ్యం 6, పౌర సరఫరాలు 4 అర్జీలు వచ్చాయి. ప్రజారవాణా, సహకార, విభిన్న ప్రతిభావంతులు, విద్య, కార్మిక, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఆర్ఐవో, రహదారులు భవనాల శాఖలకు రెండు చొప్పున అర్జీలు వచ్చాయి. వ్యవసాయం, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, కాలేజీ విద్య, డీఆర్డీఏ, ఎండోమెంట్, గృహ నిర్మాణం, ఎల్డీఎం, మైన్స్, నైపుణ్యాభివృద్ధి శాఖలకు ఒక్కో అర్జీ వచ్చింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో అర్జీలు సమర్పిస్తారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత అధికారులపై ఉందన్నారు.
ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుని, మార్గదర్శకాలకు అనుగుణంగా సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అర్జీదారులకు పరిష్కారంపై స్పష్టమైన సమాచారం అందించాలని, ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
కార్యక్రమంలో పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
