శ్రేయస్ కి అగ్నిపరీక్షే…

  • సిరీస్ ఆశలు నిలవాలంటే గెలవాల్సిందే..
  • నేడే ఇంగ్లాండ్‌తో భారత్ ఢీ..
  • బిష్ణోయ్‌పై వేటు?

ఆంధ్ర‌ప్ర‌భ : యూకే (UK) పర్యటనలో ఉన్న భారత యువ క్రికెట్ జట్టు నేడు అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరాటానికి సిద్ధమైంది. ఇంగ్లాండ్‌తో నాటింగ్హామ్ వేదికగా ఈరోజు (మంగళవారం) జరగబోయే మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ టీమిండియాకు డౌ ఆర్ డై గా మారింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ మూడింటిలో ఓడిపోయింది (ఇందులో ఐర్లాండ్‌తో 0-2 సిరీస్ ఓటమి కూడా ఉంది). ప్రస్తుతం, ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా, మరో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు విజయం సాధించింది. దీంతో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది, సిరీస్‌లో నిలవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చెత్త రికార్డు భయం!

భారత క్రికెట్ చరిత్రలోనే టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు ఎన్నడూ జరగని ఒక అవాంఛనీయ రికార్డు ముంగిట జట్టు నిలిచింది. అంతర్జాతీయ టీ20లలో భారత్ వరుసగా 5 మ్యాచ్‌ల్లో విజయం లేకుండా (Without a win) ఎప్పుడూ లేదు. ఒకవేళ నేటి మ్యాచ్‌లో గనుక ఓడిపోతే, భారత టీ20 క్రికెట్ చరిత్రలో వరుసగా అత్యధిక సార్లు ఓడిపోయిన చెత్త రికార్డు నమోదవుతుంది. అందుకే ఈ మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకంగా మారింది.

ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు..

గత మ్యాచ్‌లో (మాంచెస్టర్) ఘోరంగా విఫలమైన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండో టీ20లో 4 ఓవర్లలో వికెట్ లేకుండా 60 పరుగులు సమర్పించుకోవడమే కాకుండా.. 3 నో బాల్స్, ఒకే ఓవర్లో 29 పరుగులు ఇచ్చి భారత్ ఓటమికి బిష్ణోయ్ కారణమయ్యాడు.

అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి జట్టులో ఉండగా మూడో స్పిన్నర్ అవసరం లేదని భావిస్తున్న మేనేజ్‌మెంట్.. బిష్ణోయ్ స్థానంలో అదనపు పేసర్‌ను బరిలోకి దించనుంది. ప్రసిద్ధ్ కృష్ణ కంటే బంతిని స్వింగ్ చేయగల యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌ కు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో 3 వికెట్లు తీసినప్పటికీ, హ్యారీ బ్రూక్ చేతిలో భారీగా పరుగులు ఇచ్చుకున్న అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌లో పుంజుకోవాలని చూస్తున్నాడు.

బ్యాటింగ్ వైఫల్యాలు.. ప్లాట్ ట్రాక్ అలవాట్లే శాపమా?

ఐపీఎల్ సహా గత ఆరు నెలలుగా ఫ్లాట్ పిచ్‌లపై ఆడిన భారత బ్యాటర్లు, ఇంగ్లాండ్ పిచ్‌లపై ఉన్న‌ ఎక్స్‌ట్రా బౌన్స్, స్వింగ్, సామ్ కరన్ వేస్తున్న వేరియేషన్లను తట్టుకోలేక తడబడుతున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ దాదాపు ఒకేలాంటి స్కోర్లు (189, 190) చేసినప్పటికీ, అవి ఇంగ్లాండ్ కండిషన్స్‌లో 25 నుండి 30 పరుగులు తక్కువగా మారాయి.

ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రమే తనదైన శైలిలో వేగంగా ఆడుతూ (59, 43 పరుగులు) ఆకట్టుకుంటున్నాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడాలని కసితో ఉన్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు పరుగులు చేస్తున్నప్పటికీ ఇంగ్లీష్ బౌలింగ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించలేకపోతున్నారు.

ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ ఎలా ఉంది?

నాటింగ్హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైనది. గతంలో (2022లో) ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ కేవలం 48 బంతుల్లోనే సెంచరీతో విరుచుకుపడినప్పటికీ భారత్ విజయం సాధించలేకపోయింది. ఈసారి డే-నైట్ మ్యాచ్ కావడంతో ఇరు జట్లకు టాస్ కీలక పాత్ర పోషించనుంది. తమ సుదీర్ఘ అజేయ రికార్డును కాపాడుకుంటూ, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ యుగంలో తొలి విజయాన్ని నమోదు చేయాలని భారత యువగణం పట్టుదలతో ఉంది. రాత్రి 10 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఈ పోరు ప్రారంభం కానుంది.