ఘనంగా వీధి సుబ్రహ్మణ్యం వర్ధంతి…

ఘనంగా వీధి సుబ్రహ్మణ్యం వర్ధంతి…
ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ : మాజీ ఎమ్మెల్సీ అనంత బాబు కారు డ్రైవర్గా పనిచేసిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్యోదంతంలో నెలకొన్న మిస్టరీ నేటికీ అలానే ఉందని, ఆ విషయంలో నిందితుడైన అనంతబాబును కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని పలువురు దళిత నాయకులు, టిడిపి నేతలు అభిప్రాయపడ్డారు. ఏలూరు పవర్ పేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం వీధి సుబ్రహ్మణ్యం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తొలుత వీధి సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నేతలు మాట్లాడుతూ అరాచక విధానాలను అప్పటి వైసిపి ప్రభుత్వం పెంచి పోషించిందంటూ మండిపడ్డారు. సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, ఎస్సీ ఎస్టీ జిల్లా మానిటరింగ్ సెల్ డైరెక్టర్ దొడ్డిగర్ల శుభా మల్లిక్, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పెద్దాడ వెంకటరమణ పాల్గొన్నారు.
