పర్యావరణ హిత జీవనమే భావితరాలకు భద్రత..

పర్యావరణ హిత జీవనమే భావితరాలకు భద్రత..

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు పూర్తిగా చెక్ పెట్టాలి
స్వ‌చ్ఛ‌త‌లో విజ‌య‌వాడ‌ను అగ్ర‌స్థానంలో నిల‌బెట్టాలి
ప్రజలకు ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

ఆంధ్రప్రభ కార్పొరేషన్ : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశముందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా మానేసి పర్యావరణహితమైన గుడ్డ సంచులను ఉపయోగించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. గురువారం నిర్వహించిన నగర పర్యటనలో భాగంగా చిట్టినగర్, కొత్తపేట ప్రాంతాలను కలెక్టర్ విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పారిశుధ్యం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధ అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించారు. పర్యటనలో భాగంగా కొండ ప్రాంతంలోని ఒక దుకాణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న విషయాన్ని గమనించిన కలెక్టర్, వెంటనే వ్యాపారులతో మాట్లాడి ప్లాస్టిక్ కవర్ల వినియోగం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. దుకాణాలకు వచ్చే వినియోగదారులను గుడ్డ సంచులు తీసుకొచ్చేలా ప్రోత్సహించాలని వ్యాపారులకు సూచించారు. అదేవిధంగా, షాపుకు వచ్చిన ఒక వ్యక్తి చేతిలో ఉన్న ప్లాస్టిక్ కవరును స్వయంగా తీసుకొని, తన వద్ద ఉన్న గుడ్డ సంచిని అందజేసి ప్రజల్లో అవగాహన కల్పించారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, గుడ్డ సంచులు వంటి ప‌ర్యావ‌ర‌ణ హిత మార్గాల ద్వారా ప్లాస్టిక్ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ ఓటింగ్ ప్రక్రియలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి స్వయంగా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయించి వారి అభిప్రాయాలను నమోదు చేయించారు. విజయవాడ నగర పరిశుభ్రతపై తమ అభిప్రాయాలను స్వచ్ఛ సర్వేక్షన్ ఫీడ్‌బ్యాక్ ద్వారా తెలియజేయాలని, జాతీయ స్థాయి ర్యాంకుల్లో విజయవాడను ఉత్తమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply