Muncipal| పురపోరుకు సర్వం సిద్ధం

- ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు
- బ్యాలెట్ బాక్సుల తరలింపు
- కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు

Muncipal| ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : తెలంగాణలో మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులను ఎన్నుకునేందుకు రాష్ట్రంలోని ఓటర్లు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశారు. ప్రచార గడువు సోమవారంతో ముగియడంతో రహస్యంగా ఓటర్లను కలుస్తున్నారు. వారిని మచ్చిక చేసుకునేందుకు విందులు వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. తాయిలాలు అందిస్తూ ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికీ మద్యం, చికెన్, మటన్ల పంపిణీ జోరుగా జరుగుతుంది. ఎన్నికల ఖర్చుకు అభ్యర్థులు వెనుకాడటం లేదు. ఓటుకు 5వేల నుంచి రూ.10వేల వరకు ఇచ్చేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులకు, కుల సంఘాల నాయకులు ఆఫర్లు ఇస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. వలస ఓటర్లను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి కావాల్సిన రవాణా ఖర్చులు భరిస్తామని ఫోన్లు చేస్తున్నారు. అవసరమైతే వాహన సౌకర్యం కల్పిస్తున్నారు.

ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. సుమారు 11,000 కెమెరాలతో నిరంతర నిఘా ఉంచడంతో పాటు, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మద్యం దుకాణాలు మూసివేయడంతో పాటు, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

బ్యాలెట్ బాక్సుల తరలింపు
బ్యాలెట్ బాక్సులు, పత్రాలను పోలీస్ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్ల నుంచి రాష్ట్రంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు తరలించారు. అక్కడి నుంచి మంగళవారం ప్రతి పోలింగ్ కేంద్రానికి తరలిస్తారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ సౌకర్యం కల్పించారు. ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గు ర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.

7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు ..
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందులో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 2,996 వార్డుల్లో తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది.

బరిలో 12,930 మంది అభ్యర్థులు
ఈ ఎన్నికల బరిలో మొత్తం 12,930 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేఈ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారాయి. పట్టణ ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందో తెలియజేయడానికి ఈ ఫలితాలు ఒక కొలమానంగా నిలవనున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మద్యం దుకాణాలు మూసివేయడంతో పాటు, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.పీతో పాటు పలు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తించారు. సుమారు 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. విశేషమేమిటంటే, ఈసారి పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం.

13న ఓట్ల లెక్కింపు.. అదేరోజు ఫలితాల వెల్లడి
రేపు పోలింగ్ ముగిసిన అనంతరం ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపడతారు. అదే రోజు ఫలితాలను కూడా వెల్లడిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా ఏ పార్టీ పట్టణ స్థానిక సంస్థలపై పట్టు సాధిస్తుందో స్పష్టం కానుంది. గెలిచిన వార్డు సభ్యులు, కార్పొరేటర్లతో ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే, అదే రోజు (ఫిబ్రవరి 16న) మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, అలాగే కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలను ‘చేతులెత్తే పద్ధతి’ ద్వారా నిర్వహించాలని ఎస్ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
