13 steel bridges | ఇక మూడు గంటల్లోనే వెళ్లొచ్చు

13 steel bridges | ఇక మూడు గంటల్లోనే వెళ్లొచ్చు
హైదరాబాద్-ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్
రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక అందజేత
మూడు రాష్ట్రాల మీదుగా 671 కిలోమీటర్ల ప్రయాణం
ఈ కారిడార్ మార్గంలో మొత్తం 12 స్టేషన్లు
హైదరాబాద్, పుణేలో మెయింటెనెన్స్ డిపోలు
13 steel bridges | హైదరాబాద్, ఆంధ్రప్రభ : భాగ్యనగరం నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ప్రయాణించే వారికి సరికొత్త వేగవంతమైన అనుభూతిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే దాదాపు 12 గంటలు, సాధారణ రైళ్లలో అయితే 15 గంటల సుదీర్ఘ సమయం పడుతున్న ప్రయాణాన్ని.. కేవలం 3 గంటల లోపు (కనిష్టంగా 2.55 గంటలు, గరిష్టంగా 3.13 గంటలు) పూర్తి చేసేలా “హైదరాబాద్-పుణె-ముంబై హైస్పీడ్ రైలు కారిడార్ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన క్షేత్రస్థాయి సర్వేలు ఇప్పటికే పూర్తి కాగా, తాజాగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా సిద్ధమైందని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా వెల్లడించింది.

13 steel bridges | మూడు రాష్ట్రాల మీదుగా 671 కిలోమీటర్ల ప్రయాణం..
ఈ హైస్పీడ్ కారిడార్ మొత్తం పొడవు 671 కిలోమీటర్లు. ఈ కారిడార్ మూడు రాష్ట్రాల పరిధి గుండా సాగనుంది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 457 కిలోమీటర్లు (68 శాతం), కర్ణాటకలో 121 కిలోమీటర్లు (18 శాతం), తెలంగాణ పరిధిలో 93 కిలోమీటర్ల (14 శాతం) మేర ట్రాక్ నిర్మిస్తారు. గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ఈ బుల్లెట్ రైళ్లను డిజైన్ చేస్తున్నారు.
13 steel bridges | మొత్తం 12 స్టేషన్లు.. తెలంగాణలో శంషాబాద్ జోడింపు..
ఈ కారిడార్ మార్గంలో మొత్తం 12 స్టేషన్లను ప్రతిపాదించారు. తెలంగాణ: హైదరాబాద్ (కోకాపేట), వికారాబాద్లతో పాటు తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాన్ని కూడా ఈ ప్రాజెక్టులో చేర్చారు.
కర్ణాటక: కలబురిగి.
మహారాష్ట్ర: విఖ్రోలి, థానే, నవీ ముంబై, లోనావాలా, పింప్రిచించ్వాడ్, పుణె, బారామతి, పండరీపూర్, సోలాపూర్.
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఒక్కో స్టేషన్ ప్రాంగణం, పార్కింగ్ , ఇతర వసతుల కోసం దాదాపు 247 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం భూసేకరణకు సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ విజ్ఞప్తి చేసింది. అలాగే మెయింటెనెన్స్ కోసం థానే , హైదరాబాద్లలో భారీ డిపోలను ఏర్పాటు చేయనున్నారు.
13 steel bridges | ఖండాలా ఘాట్లో సొరంగాలు.. నదులపై భారీ బ్రిడ్జ్లు
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అనేక ఇంజనీరింగ్ అద్భుతాలు చోటు చేసుకోనున్నాయి. కారిడార్లోని మహారాష్ట్ర పరిధిలో 3 ప్రాంతాల్లో మొత్తం 35.30 కిలోమీటర్ల మేర భూగర్భ (అండర్గ్రౌండ్) మార్గాన్ని నిర్మిస్తారు. ముఖ్యంగా పశ్చిమ కనుమల్లోని ఖండాలా ఘాట్ ప్రాంతంలో 13 చోట్ల కొండలను తొలిచి దాదాపు 24 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ నగర పరిధిలో మెట్రో తరహాలోనే పిల్లర్లపై (ఎలివేటెడ్) ఈ ట్రాక్ నిర్మాణం సాగుతుంది.
13 steel bridges | 101 వంతెనలు…
ఈ మార్గంలో ప్రయాణించే నదులపై మొత్తం 101 వంతెనలను నిర్మించనున్నారు. వీటిలో 13 స్టీల్ బ్రిడ్జ్లు కాగా, 29 భారీ వంతెనలు ఉంటాయి. ప్రధానంగా మూలా-మూఠా నదిపై 360 మీటర్లు, భీమా నదిపై 280 మీటర్లు, బోరి నదిపై 225 మీటర్ల పొడవైన వంతెనలు రానున్నాయి.
13 steel bridges | ఒక్కో రైల్లో 1,215 మంది ప్రయాణం..
ఈ కారిడార్లో నడిచే ఒక్కో బుల్లెట్ రైలు 16 బోగీలతో, ఒకేసారి 1,215 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చిన ప్రారంభ సంవత్సరంలో రోజుకు 63,494 మంది ప్రయాణిస్తారని, 2061 నాటికి ఈ సంఖ్య రోజుకు 1.52 లక్షలకు పైగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్-ముంబై మధ్య రవాణా, వాణిజ్య రంగాలు సరికొత్త పుంతలు తొక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
