Women T20 World Cup | భారత్–పాకిస్థాన్ మ్యాచ్

Women T20 World Cup | భారత్–పాకిస్థాన్ మ్యాచ్

Women T20 World Cup | ఇంగ్లాండ్‌లో మహిళల టీ20 ప్రపంచకప్..
ఇప్ప‌టివ‌ర‌కు ట్రోఫీ గెల‌వ‌ని టీమిండియా
ఈసారి క‌ప్ గెలుపే లక్ష్యంగా బ‌రిలోకి..
గ్రూప్‌-1లో భారత్‌కు కఠిన సవాళ్లు

Women T20 World Cup | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: మహిళల టీ20 ప్రపంచకప్ 2026కు రంగం సిద్ధమైంది. జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. ఈసారి మొత్తం 12 జట్లు పాల్గొంటుండగా, 33 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్ జూన్ 12న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది.

భారత మహిళల జట్టు తన ప్రపంచకప్ ప్రయాణాన్ని చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ ద్వారా ప్రారంభించనుంది. భారత్–పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది. ఈ హైఓల్టేజ్ పోరుపై ఇప్పటికే క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ఈసారి భారత్ గ్రూప్‌-1లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు ఐదేసి మ్యాచ్‌లు ఆడనుంది. రెండు గ్రూపుల నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

భారత్‌కు గ్రూప్ దశలోనే కఠిన పరీక్షలు ఎదురుకానున్నాయి. పాకిస్థాన్‌తో ప్రారంభ పోరు తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. కాబట్టి భారత్ సెమీస్ రేసులో నిలవాలంటే గ్రూప్ దశ నుంచే స్థిరమైన ప్రదర్శన అవసరం.

మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. 2020లో భారత్ ఫైనల్‌కు చేరినా, ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. 2024 ఎడిషన్‌లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఇప్పుడు 2026 టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ట్రోఫీ కరవును తీర్చాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

ఇటీవలి కాలంలో భారత మహిళల జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో మంచి సమతుల్యతను కనబరుస్తోంది. స్మృతి మంధాన, షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ వంటి బ్యాటర్లు ఫామ్‌లో ఉంటే, బౌలింగ్‌లోనూ కీలక సమయంలో వికెట్లు తీసే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు జట్టుకు బలం. ఈసారి ఒత్తిడిని అధిగమించి నాకౌట్ దశకు చేరుకోవడం భారత్‌కు ప్రధాన లక్ష్యంగా మారింది.

మొత్తంగా, జూన్ 14న జరిగే భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌తో టీమిండియా ప్రపంచకప్ ప్రయాణం మొదలవుతుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్‌కు టోర్నమెంట్‌లో శుభారంభం లభించడమే కాకుండా, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌.. కెప్టెన్ జ‌వాబు

మహిళల టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను విలేకరులు పలు ప్రశ్నలు అడిగారు. ఈ టీ20 ప్రపంచ కప్ మీకు చివరిది అవుతుందా అని ఓ రిపోర్టర్ హర్మన్‌ప్రీత్‌ను ప్రశ్నించాడు. దీనికి ఆమె సరదాగా స్పందించింది. ‘నేను తప్పుకోవాలని మీరు కోరుకుంటున్నారా’’ అని ఎదురు ప్రశ్న వేసింది. ‘మీ ప్రణాళికలు గురించి తెలుసుకునేందుకే ఈ ప్రశ్న అడిగా. టీ20 నుంచి వైదొలగడానికి సమయం రాలేదని మీరు భావిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని విలేకరి సమాధానమిచ్చాడు.

CLICK HERE TO READ 300runs | భారీ తేడాతో అఫ్గాన్ ఓట‌మి

CLICK HERE TO READ MORE

Leave a Reply