హైదరాబాద్ : తెలంగాణలో మహిళలను పూజిస్తాం అందరినీ గౌరవించే సంస్కృతి ఉందిఇలాంటి భయానక అనుభవాలు ఎవరూ ఎదుర్కోవద్దుబాధితురాలిని తప్పుగా చూపించడాన్ని ఖండిస్తున్నాఆ చేదు అనుభవానికి చింతిస్తున్నట్టు పేర్కొన్న కేటీఆర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ :హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో కంటెస్టెంట్లను వేశ్యల్లా చూస్తున్నారని, ఇది తనకు నచ్చలేదని, అందుకే పోటీల నుంచి తాను తప్పుకుంటున్నానని మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆమెకు చేదు అనుభవం ఎదురైనందుకు చింతిస్తున్నానని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి..‘మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ వేదికలపై మహిళలతో వివక్షాపూరిత ఆలోచనలు ఉన్న మెంటాలిటీనీ ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలి. మిల్లా మ్యాగీ.. మీరు ఒక బలమైన మహిళ. మా తెలంగాణలో మీరు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు మేం చింతిస్తున్నాం. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది. ఇక్కడ మహిళలను పూజిస్తాం, గౌరవిస్తాం, వారి అభివృద్ధికి సమాన అవకాశాలను కల్పిస్తాం. రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి గొప్ప నాయకులు మా తెలంగాణ మట్టిలో పుట్టినవారే’ అని కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
సమగ్ర విచారణ జరపాలి.
.అంతేగాక ‘దురదృష్టవశాత్తు మీరు ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం నిజమైన తెలంగాణను ప్రతిబింబించేది కాదు. మీరు త్వరగా ఆ బాధ నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నా. ఏ ఒక్క మహిళ గానీ, ఆడపిల్ల గానీ ఇలాంటి భయానక అనుభవాలను ఎదుర్కోకూడదని ఒక అమ్మాయికి తండ్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాధితురాలిని విమర్శించడం, ఆమెను తప్పుగా చూపించడాన్ని ఖండిస్తున్నా. అలాగే మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నా’ అని కేటీఆర్ పేర్కొన్నారు.