minus 0.15persant | ప్రజల చేతిలో..పైసల్లేవ్! సర్కారు ఖజానా ఖాళీ

minus 0.15persant | ప్రజల చేతిలో..పైసల్లేవ్! సర్కారు ఖజానా ఖాళీ
minus 0.15persant | తెలంగాణలో ఆర్థిక మందగమనం
రోజు రోజుకూ పడిపోతున్న పన్ను రాబడి
రియల్ ఎస్టేట్ రంగం కుదేలు
సేవా రంగాల్లో పురోగతి శూన్యం
అంతకంతకూ పెరిగిపోతున్న ధరలు
ప్రజలను భయపెడుతున్న ద్రవ్యోల్భణం
పింఛన్లు, రైతు భరోసా, మహిళా భరోసా, విద్యా భరోసా, దళితబంధు పథకాలకు గ్రహణం
గొర్రెలు, బర్రెలు, చేపల పంపిణీ పథకాలకూ మంగళం
గ్రామీణ ఆర్థిక రంగం పూర్తిగా నిర్వీర్యం
పల్లె ప్రజలలో డబ్బు ఆడని దుస్థితి
దీంతో నిలిచిపోయిన ద్రవ్య చలామణి
కోనుగోలు శక్తి క్షీణించడంతో పన్నుల వసూళ్లలో తగ్గుదల
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కనిపించని ఆర్థిక స్థిరత్వం
minus 0.15persant | హైదరాబాద్ , ఆంధ్రప్రభ : తెలంగాణలో ప్రస్తుతం ఆర్థిక మందగమనం కొనసాగుతున్నది. దీని ప్రభావం ప్రభుత్వంపైనా, సంక్షేమ పథకాలపైనా ప్రభావం పడుతోంది. గడిచిన మూడు నెలల కాలంలో ప్రభుత్వానికి రావలసిన పన్ను రాబడి క్రమక్రమంగా తగ్గుతున్నది. ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా రాష్ట్ర ఖజనాలో కాసుల గలగల తగ్గిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించలేకపోయిందనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రతి నెల లోటు బడ్జెట్తో.. రుణాలతోనే ప్రభుత్వ బండి నడుస్తున్నది. దీనికి అనేక రకాలు కారణాలు ఆర్థిక వేత్తలు ఎత్తి చూపుతున్నారు. ముఖ్యంగా ప్రజల నుంచి ద్రవ్యచలామణి గణనీయంగా తగ్గడం ఒక కారణమంటున్నారు.
ఆ పదేళ్లు నగదు పరుగులు
తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో దశాబ్దకాలంగా కొనసాగిన అధిక వృద్ధి నమూనా ఆర్థిక చక్రాన్ని చైతన్యవంతంగా ఉంచింది. వేతనాలు, సంక్షేమం, పెట్టుబడులు ఆర్థిక ప్రసరణను నడిపించాయి. నేడు, విధాన మార్పులు, తగ్గిన గృహ నగదు ప్రవాహం ఈ చక్రాన్ని మందగింపజేస్తున్నాయి. దీనివల్ల డిమాండ్, గ్రామీణ ఆదాయాలు, ఉపాధి బలహీనపడుతున్నాయి. తెలంగాణ ఏర్పడక ముందు, ఈ రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోగలదా? అనే ప్రాథమిక ప్రశ్న పదేపదే తలెత్తింది. ఒక దశాబ్ద కాలపు పాలన గణాంకాలు, ఫలితాల ద్వారా ఆ ప్రశ్నకు సమాధానమిచ్చింది. ఇక.. 2013–14లో ₹4.51లక్షల కోట్లుగా ఉన్న తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి .. 2023–24 నాటికి సుమారు 22.4 శాతం సగటు వార్షిక వృద్ధి రేటును నమోదు చేస్తూ ₹14.63 లక్షల కోట్లకు పెరిగింది. తలసరి ఆదాయం ₹0.95 లక్షల నుండి ₹3.47 లక్షలకు పెరిగి, సుమారు 26.4 శాతం సగటు వార్షిక వృద్ధిని సాధించింది. ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కాదు. ఒక ప్రణాళికాబద్ధమైన ఆర్థిక నమూనా ద్వారా చోటుచేసుకున్న నిర్మాణాత్మక పరివర్తనకు సూచికలు.

కాంగ్రెస్ పాలనలో..
రాబడి గణాంకాలు ఈ ధోరణిని మరింతగా ధ్రువీకరిస్తున్నాయి. రాబడి వసూళ్లు 2014–15లో ₹51,041 కోట్ల నుంచి 2023–24 నాటికి ₹1,69,293 కోట్లకు పెరిగాయి. ఇది సుమారు 23శాతం సగటు వార్షిక వృద్ధికి సమానం. అయితే.. 2024–25లో రాబడి వసూళ్లు ₹1,67,804 కోట్లకు పడిపోయాయి. ఇది ₹1,489 కోట్ల తగ్గుదల లేదా 1 శాతం ప్రతికూల వృద్ధిని సూచిస్తుంది. రాష్ట్ర సొంత పన్ను రాబడి కూడా ఇదే విధమైన ధోరణిని చూపుతోంది. ఇది 2014-15లో ₹29,288 కోట్ల నుండి 2023-24 నాటికి ₹1,11,798 కోట్లకు పెరిగింది. ఇది సుమారుగా 31.3 శాతం సగటు వార్షిక వృద్ధికి సమానం. కానీ.. 2024-25లో ఇది ₹1,09,233 కోట్లకు పడిపోయింది. ₹ 2,565 కోట్ల తగ్గుదల లేదా 2.3 శాతం ప్రతికూల వృద్ధిని సూచిస్తుంది. ఇటీవలి వృద్ధి గణాంకాలు ఈ మందగమనాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ఆర్థిక వ్యవస్థకు డేంజర్ బెల్..
ఏ రాష్ట్రానికైనా డిఫ్లేషన్ అనేది ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు డేంజర్ బెల్ వంటిది. అందుకే ఆరోగ్యకరమైన ఆర్థిక వృద్ధి కోసం ద్రవ్యోల్బణ రేటు 2-6% మధ్య ఉండాలని రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ, తెలంగాణలో ద్రవ్యోల్బణం సున్నా కంటే తక్కువకు పడిపోయింది. ‘డిఫ్లేషన్ కారణంగా ప్రజల్లో కొనుగోలుశక్తి పడిపోయి వ్యాపారాలు దెబ్బతింటాయి. ఉద్యోగాలు ఊడిపోతాయి. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉండదు. తెలంగాణలో ఇప్పుడు ఇదే జరుగుతున్నది’ అని ఆర్థికరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏది కొనాలన్నా కొరివే..
రాష్ట్రంలో ధరలు తగ్గడం అటుంచితే.. వస్తు, సేవలను వినియోగించుకొనే ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని అర్థం చేసుకోవాలి. ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రమాదకరం. ప్రస్తుతం తెలంగాణ ద్రవ్యోల్బణ రేటు మైనస్ 0.15 శాతానికి పడిపోయింది. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. కూరగాయలు, నూనె, నిత్యావసరాల ధరల్లో మార్పు లేదు. స్కూల్, కాలేజీ ఫీజులు కూడా ఏమాత్రం తగ్గలేదు. అయినప్పటికీ ద్రవ్యోల్బణం నెగటివ్కు చేరిందంటే.. వీటిని కొనుగోలు చేసే పౌరుల ఆర్థికశక్తి తగ్గిపోయిందని అర్థం చేసుకోవాలి.
