Ludhiana Gas Leak | ముగ్గురు కార్మికుల మృతి..

Ludhiana Gas Leak | ముగ్గురు కార్మికుల మృతి..

Ludhiana Gas Leak | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : పంజాబ్‌లోని లుధియానా నగరంలో విషవాయువు లీక్‌ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గాస్‌పురా ప్రాంతంలోని ఓ టూల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫ్యాక్టరీలో ఆదివారం రాత్రి విషవాయువు లీక్‌ కావడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ ముగ్గురు కార్మికులు ఇవాళ మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

ఫ్యాక్టరీలో పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా విషవాయువు వ్యాపించడంతో ఏడుగురు కార్మికులు స్పృహ కోల్పోయారు. సహచరులు, స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితులకు వైద్యులు చికిత్స అందించినప్పటికీ ముగ్గురు ప్రాణాలు దక్కలేదు.

మృతుల్లో గాస్‌పురా ప్రాంతానికి చెందిన మాన్‌సింగ్‌, ఆయన కుమారుడు అమిత్‌ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో మృతుడి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, కార్మిక శాఖ అధికారులు ఫ్యాక్టరీని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. విషవాయువు లీక్‌కు గల కారణాలను గుర్తించే పనిలో నిపుణుల బృందాలు నిమగ్నమయ్యాయి. ఈ ఘటనతో కార్మికుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Leave a Reply