కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి హరీష్ రావు..
కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి హరీష్ రావు..
- మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి
- మెదక్లో ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు
- మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి తన్నీరు హరీష్ రావు అని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మెదక్ లోని సాయి బాలాజీ గార్డెన్స్ లో జనహృదయనేత జనం మెచ్చిన నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం.పద్మదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, న్యాయవాది జీవన్ రావు, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, యువకులు, అభిమానులు రక్తదానాన్ని చేశారు. ఈ సందర్బంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ గులాబీ జెండాను చేతబట్టినప్పటి నుంచి ఆయన అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి తన్నీరు హరీష్ రావు అని పేర్కొన్నారు. 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్తో కలిసి ప్రతి జిల్లాను సందర్శిస్తూ ఉద్యమకారులను ఉత్తేజపరిచిన నాయకుడని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కేసీఆర్ ప్రభుత్వంలో హరీష్ రావు ఇరిగేషన్, ఆర్థిక శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారని తెలిపారు. ఇరిగేషన్ మంత్రిగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విశేష కృషి చేశారని కొనియాడారు. ప్రజాసేవే ధ్యేయంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న హరీష్ రావు రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమం కోసం చూపుతున్న చిత్తశుద్ధి, అంకితభావం, సేవాతత్పరత ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు.
హరీష్ రావు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. మెదక్ ఎంసీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం కొరత ఉందని తెలిసిన వెంటనే హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో రక్తదానం చేసిన యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సేకరించిన రక్తాన్ని మెదక్ రక్తనిధి ద్వారా పేద ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. దీనివల్ల రక్తం కొరత సమస్య కొంత మేర తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోసారి మెదక్ జిల్లా తరఫున బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బట్టి జగపతి, కృష్ణారెడ్డి, గంగా నరేందర్, మున్సిపల్ కౌన్సిలర్ దీపక్ కుమార్, మాజీ కౌన్సిలర్లు మాయ మల్లేశం,ఆర్కే. శ్రీనివాస్, చంద్రకళ, నాయకులు కృష్ణ గౌడ్, లింగా రెడ్డి, సోములు, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ బాలా గౌడ్, మెదక్, హవేలీఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు మంజ గౌడ్, సీహెచ్ శ్రీనివాస్ రెడ్డి, ఆయా మండలాల సర్పంచ్లు, మాజీ సర్పంచ్,లు మాజీ ఎంపీటీసీలు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
