IND vs PAK | రేపే మహాసంగ్రామం… అందరి కళ్లు ఈ మ్యాచ్ పైనే !
- దాయాదుల పోరుకు తీవ్ర ఉత్కంఠ
- సెమీస్పై బెర్త్ పై భారత్ కన్ను..
- పాక్ కు డూ ఆర్ డై
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు (ఆదివారం) కీలక మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నారు. గ్రూప్-ఎలో ఉన్న భారత్-పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. దీంతో దాయాదుల పోరుకు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే రేపటి మ్యాచ్ లో భారత జట్టు గెలిస్తే దాదాపు సెమీస్ చేరడం ఖాయం. మరోవైపు ఈ మ్యాచ్ పాకిస్థాన్కు డూ ఆర్ డై గా మారింది. ఈ మ్యాచ్లో ఓడిపోతే దాయాది జట్టు బ్యాగులు సర్దుకుని ఇంటికి బయల్దేరాల్సిందే ! ఒకవేళ పాక్ చేతిలో భారత్ ఓడిపోతే.. మార్చ్ 2న న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంటుంది.
నెట్ రన్ రేట్ కీలకం !
తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా… 0.408 నెట్ రన్తో గ్రూపు-ఏ పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. భారత్ ఖాతాలో ప్రస్తుతం రెండు పాయింట్లు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ పై విజయం సాధించిన న్యూజిలాండ్ ఖాతాలోనూ రెండు పాయింట్లే ఉన్నాయి.
అయితే భారత నెట్ రన్రేటు కంటే కివీస్ నెట్ రన్రేటు (+1.200) అధికంగా ఉండటంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక బంగ్లాదేశ్ మూడో స్థానంలో, పాకిస్థాన్ నాలుగో స్థానంలో ఉన్నాయి. గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్కు చేరుకుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే భారత్ కు నెట్ రన్రేట్ కీలకంగా మారే అవవాశముంది.
సొంత గడ్డపై పాక్ కు తిప్పలు..
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు గ్రూప్ దశల్లో తమ చివరి మ్యాచ్ బంగ్లాదేశ్తో ఈనెల 27న ఆడాల్సి ఉంది. భారత్, బంగ్లాదేశ్ పై విజయం సాధించినా సెమీస్కు చేరే అవకాశాలు పాక్కు తక్కువగానే ఉన్నాయి. సెమీస్ కు చేరుకోవాలంటే మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే.. పాకిస్థాన్ తో పోలిస్తే బంగ్లాదేశ్ నెట్ రన్ రేటు కాస్త మెరుగ్గానే ఉంది. అయితే, ఆ జట్టు తదుపరి న్యూజిలాండ్, పాకిస్థాన్తో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్లు గెలిస్తే సెమీస్కు చేరే అవకాశం ఉంది. అయితే.. ఇది కాస్త కష్టమైన పనే.
కీలక మ్యాచ్ లో పాక్ కు ఎదురుదెబ్బ !
ఇలాంటి కీలక మ్యాచ్లో పాకిస్థాన్కు భారీ ఎదురుదెబ్బే తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఫఖర్ జమాన్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఆయన నిష్క్రమణ జట్టుకు కష్టమేనని చెప్పొచ్చు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్పై ఫఖర్ సెంచరీతో చెలరేగాడు. కాగా, ఫఖర్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ కు ఐసీసీ టెక్నికల్ కమిటీ ఓకే చెప్పింది.
ఇక ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారడంతో… రేపటి మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. దీంతో క్రికెట్ అభిమానుల దృష్టి అంతా ఈ మ్యాచ్పైనే ఉంది !