AP | ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్ : పవన్ కల్యాణ్
సంక్షేమం – సంస్కరణల మధ్య సమతుల్యతతో వికసిత్ భారత్ లక్ష్యంతో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల కాలంలో రాష్ట్రంలో రూ.3 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించిన ఎన్డీయే కేంద్ర ప్రభుత్వం… ఈరోజు పార్లమెంట్లో ప్రకటించిన 2025-2026 వార్షిక బడ్జెట్లో మరిన్ని కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
ఈ సందర్భంగా…. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు బడ్జెట్ను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆదాయపు పన్ను మినహాయింపును 12 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం మధ్యతరగతి ఉద్యోగులకు ఊరటనిచ్చిందని అన్నారు. 5ఒకేసారి 5 లక్షల పన్ను మినహాయింపు చేస్తూ… 7 లక్షల నుంచి 12 లక్షలకు పెంచడం సాహసోపేతమైన నిర్ణయమన్నారు.
కేంద్ర బడ్జెట్ కేటాయింపులను సద్వినియోగం చేసుకుంటాం…
•5 కోట్ల ప్రజల ఆశలకు ప్రతిరూపంగా నిర్మాణం జరుగుతున్న ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్లను కేటాయిస్తూ, భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తాం అని చెప్పడం రాజధాని నిర్మాణం సజావుగా, వేగవంతంగా సాగేందుకు ఉపయోగపడనుంది.
•ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు వ్యయ సవరణకు ఆమోదం తెలుపడమే కాకుండా రూ.5,936 కోట్లను కేటాయించడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని 41.15 మీటర్లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వడం, బ్యాలెన్స్ గ్రాంట్ రూ. 12,157 కోట్లుగా ప్రకటించడం, పోలవరం అథారిటీకి అదనంగా మరో రూ.54 కోట్లు కేటాయించి, పోలవరం నిర్మాణం వేగవంతం అయ్యేందుకు సహకరించారు.
- జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని 2028 వరకు పొడిగించడం ద్వారా ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్ అందించాలనే ఆశయాన్ని సాధించేందుకు తోడ్పడనుంది.
- కేంద్ర బడ్జెట్ లో రక్షణ శాఖ తరవాత అత్యధికంగా 2.66 లక్షల కోట్ల నిధులను గ్రామీణాభివృద్ధికి కేటాయించడం ద్వారా, రాష్ట్రంలోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు అధిక నిధులు సాధించే ఆస్కారం లభించింది.
- విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 3295 కోట్లను కేటాయించడం ద్వారా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు NDA ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి రుజువైంది. అలాగే విశాఖ పోర్ట్ అభివృద్ధికి రూ. 730 కోట్లు కేటాయింపు ద్వారా పోర్ట్ సామర్థ్యం పెంపు, వాణిజ్యాభివృద్ధికి దోహదపడనున్నాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం… కేంద్ర బడ్జెట్ కేటాయింపులను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేయనుందని పేర్కొన్నారు.