Center Decision | ఉగ్ర‌వాద దాడి ఇక యుద్ధ దాడే … కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

న్యూ ఢిల్లీ – దేశ భద్రత విషయంలో భారత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉగ్రవాద దాడులను యుద్ధ చర్యలుగా పరిగణించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. “తీవ్రవాద చర్యలను సహించేది లేదు. పాకిస్తాన్‌లోకి చొరబడి వెంటాడి మరీ విధ్వంసకారులను మట్టుబెట్టాలి. ఉగ్రవాద చర్యలను సరైన రీతిలోనే ఎదుర్కోవాలి” అని ఆయన తేల్చి చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశ భద్రతపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాద శిబిరాలపై నిఘా పెంచాలని, అవసరమైతే సైనిక చర్యలకు కూడా వెనుకాడవద్దని ఆయన సైన్యానికి సూచించారు.

ఈ నిర్ణయం ప్రకారం, ఉగ్రవాద దాడులను కేవలం శాంతిభద్రతల సమస్యగా కాకుండా, దేశంపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. దీంతో సైన్యానికి మరింత స్వేచ్ఛ లభిస్తుంది. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు సైన్యానికి పూర్తి అధికారం లభిస్తుంది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్‌కు స్పష్టమైన హెచ్చరికగా పరిగణించవచ్చు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవని భారత్ స్పష్టం చేసింది. ఇకపై ఉగ్రవాద చర్యలను భారత్ ఏమాత్రం సహించబోదని, దీటుగా బదులివ్వడానికి సిద్ధంగా ఉందని ఈ నిర్ణయం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *