B52-Bomber-Crash : బీ-52 .. వృద్ధ బాహుబలే Andhra Prabha Top Story
B52-Bomber-Crash : బీ-52 .. వృద్ధ బాహుబలే Andhra Prabha Top Story
- ఇరాన్ యుద్ధలలో అలసిన బాంబర్
- బెడిసిన నవ యవన్న ప్రయత్నం
- అమెరికా వైమానిక దళంలో విషాదం
- 8 మంది సిబ్బంది సజీవ దహనం
- రాడార్ ఆధునికీకరణ పరీక్షలో ప్రమాదం
- ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ వైఫల్యమే కారణమా?
- 1982 తర్వాత అత్యంత దారుణ ప్రమాదం
- 64 ఏళ్లుగా ఆగిన బీ-52 ఉత్పత్తి
- 48.6 బిలియన్ డాలర్ల ఆధునికీకరణ ప్రాజెక్టుకు ఎదురుదెబ్బ
- ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం
- అమెరికా వ్యూహాత్మక వైమానిక శక్తికి గట్టి షాక్
( ఆంధ్రప్రభ, వాషింగ్టన్ ప్రతినిధి)
అమెరికా వైమానిక దళంలోని అత్యంత శక్తివంత బాహుబలి బీ-52 బాంబర్ కుప్పకూలింది. అమెరికా వైమానిక దళంలో విషాదం నెలకొంది. 8 మంది క్రూ సభ్యులు దుర్మరణం చెందారు. భారత కాలమానం ప్రకారం జూన్ 16, 2026 సోమవారం అర్ధ రాత్రి 11:50 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. లాస్ ఏంజిల్స్కు ఉత్తరాన దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో, మోజావే ఎడారి లోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ రన్వేపైనే ఈ ప్రమాదం జరిగింది. ఈ విమానంలో ఉన్న 8 మంది సిబ్బంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరణించిన వారిలో కొందరు వైమానిక దళ సైనికులు, ప్రభుత్వ పౌర అధికారులు బోయింగ్ సంస్థకు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రకటన ప్రకారం, ప్రమాదం తీవ్రత దృష్ట్యా ఇందులో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని స్పష్టమైంది.
B52-Bomber-Crash : రాడార్ ఆధునీకరణ వైఫల్యం
ఈ విమానం రొటీన్ ఆపరేషన్లో లేదు. ఇది ఒక “రొటీన్ టెస్ట్ మిషన్ లో భాగంగా రాడార్ ఆధునికీకరణ పరీక్షల కోసం టేకాఫ్ అయింది. ఎడ్వర్డ్స్ ఎయిర్బేస్ రన్వే నుండి గాల్లోకి లేచిన కొన్ని క్షణాల్లోనే, ఎక్కువ పైకి ఎగిరే లోపు ఈ విమానం ఒక్కసారిగా రన్వేపై కుప్పకూలింది. కూలిన వెంటనే విమానంలో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించాయి.
B52-Bomber-Crash : ఎఫ్ సీసీ ఫెయిల్..
ప్రమాదానికి ఖచ్చిత కారణాలపై యూఎస్ మిలిటరీ ఉన్నత స్థాయి దర్యాప్తును ప్రారంభించింది. ఏవియేషన్ నిపుణుల ప్రాథమిక అంచనా ప్రకారం , విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోవడాన్ని బట్టి చూస్తే, దాని ‘ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్’ పూర్తిగా విఫలమై ఉండే అవకాశం ఉంది. కొత్త పరికరాల టెస్టింగ్ సమయంలో సాంకేతిక లోపం రావడం లేదా ఇంజన్ ఒక్కసారిగా ఫెయిల్ అవ్వడం కూడా కారణం కావచ్చు. బీ-52 బాంబర్ విమానాలు 1950 కాలం నుండి అమెరికా వైమానిక దళంలో అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగల అత్యంత కీలక యుద్ధ విమానాలుగా సేవలు అందిస్తున్నాయి. 1982 తర్వాత ఈ రకం విమానాల్లో జరిగిన అత్యంత దారుణ వైమానిక ప్రమాదం ఇదే కావడం గమనార్హం.
B52-Bomber-Crash : ఇది .. వృద్ధ బాహుబలే
కుప్పకూలిన బీ-52 విమానం, వాయుసేనలోని అత్యంత పాత విమానాలలో ఒకటి, దీని వయస్సు 71 ఏళ్లు. ఇది 1955లో తొలిసారిగా సేవలలోకి ప్రవేశించింది. సాధారణంగా ఐదుగురు సిబ్బందితో సుదూర ప్రాంతాలకు వెళ్ళగల భారీ బాంబర్ , 70,000 పౌండ్ల వరకు బాంబులు , ఇతర ఆయుధ సామగ్రిని మోసుకెళ్లగలదు. ప్రస్తుతం వాడుకలో ఉన్న బి-52హెచ్ (B-52H) విమానం, వైమానిక దళ ఆయుధాగారంలో ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రమాదానికి ముందు ఈ దళం వద్ద 76 విమానాలు ఉండేవి. అమెరికా, ఇరాన్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న సంఘర్షణ సమయంలో దీనిని బాంబు దాడుల కోసం ఉపయోగించారు. బి-52హెచ్ అణ్వాయుధాలను, అణ్వాయుధాలు కలిగిన క్రూయిజ్ క్షిపణులను కూడా మోయగలదు. సోమవారం జరిగిన ప్రమాదానికి ముందు, ఈ విమానానికి అత్యంత ఇటీవలి ప్రాణాంతక ప్రమాదం 2008లో జరిగింది. అప్పుడు, పరేడ్ ఫ్లైఓవర్కు సిద్ధమవుతున్న సమయంలో గ్వామ్ తీరానికి సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో వారి బి-52 విమానం కూలిపోవడంతో ఆరుగురు వైమానిక దళ సిబ్బంది మరణించారు.
B52-Bomber-Crash : 64 ఏళ్లుగా.. కొత్త ఉత్పత్తి లేదు
బోయింగ్ తయారు చేసిన ఈ బాంబర్ 1962 నుండి ఉత్పత్తిలో లేదు, అయినప్పటికీ అనేక జీవితకాల పొడిగింపు కార్యక్రమాలు ఎయిర్ఫ్రేమ్ను ఆధునీకరించి, దానిని ఎగురుతూనే ఉండేలా చేశాయి. డిఫెన్స్ న్యూస్ ప్రకారం, వైమానిక దళం ఇటీవల కొత్త ఇంజిన్ల రూపకల్పనపై దృష్టి సారించి మరో B-52 అప్గ్రేడ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది, దీని మొత్తం అంచనా వ్యయం 48.6 బిలియన్ డాలర్లు. ఈ విమానం ఇప్పుడు ఉత్పత్తిలో లేనందున, ఏవైనా కొత్త వాటిని అరిజోనాలోని డేవిస్-మోంథాన్ వైమానిక దళ స్థావరం వద్ద ఉన్న “బోన్యార్డ్” అని పిలిచే ప్రదేశంలో నిల్వ ఉంచిన విడి ఎయిర్ఫ్రేమ్ల నుండి సేకరించాలి. 2016లో గ్వామ్లో ఒక B-52H విమానం ప్రాణనష్టం లేకుండా కూలిపోయిన తర్వాత కూడా ఇలాగే చేశారు.
