Eluru | పెన్షన్దారులకు ఆర్ధిక భరోసా

Eluru | పెన్షన్దారులకు ఆర్ధిక భరోసా
- ఎమ్మెల్యే బడేటి చంటి
Eluru | ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలను పుష్కలంగా, పారదర్శకంగా చేరవేసేందుకు పటిష్టవంతమైన బృహత్తర ప్రణాళికలతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దానిలో భాగంగానే సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహిస్తున్నామని, పెన్షన్దారులకు ఆర్ధిక భరోసా కల్పిస్తూ వారి ఆనందాల్లో భాగస్వాములమవుతున్నామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక 9వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ – 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం డివిజన్లోని పెన్షన్దారుల ఇళ్ళకు స్వయంగా వెళ్ళిన ఎమ్మెల్యే, పెన్షన్ సొమ్ములను వారికి అందించి, భరోసా కల్పించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సంతోషాల్లో భాగస్వామి అయ్యేవిధంగా కూటమి ప్రభుత్వ పాలన అత్యంత సమర్థవంతంగా కొనసాగుతోందన్నారు. ప్రజల ఆనందాల్లో తోడుగా నిలవడంతో పాటూ, వారి సంతోషాల్లో పాలుపంచుకునే లక్ష్యంతోనే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామన్నారు. ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా తానే స్వయంగా తెలుసుకునేందుకు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నానన్న ఎమ్మెల్యే… దానిలో భాగంగానే ప్రతినెలా పెన్షన్ల పంపిణీలో భాగస్వామ్యం వహిస్తున్నట్లు చెప్పారు. ఇదేసమయంలో జనవరి 1వ తేదీ సెలవురోజు కావడంతో ముందస్తుగా, న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31నే పెన్షన్లను అందించామన్నారు. ఆర్టీసి విజయవాడ జోన్ – 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి పాలన అత్యంత సమర్థవంతంగా, జనరంజకంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, జిల్లా అధికార ప్రతినిధి పూజారి నిరంజన్, కో – ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్ పెదబాబు, ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఎ.భానుప్రతాప్, కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు, వివిధ హోదాలలో ఉన్న కూటమి నాయకులు పాల్గొన్నారు.
