ప్రత్యేక చొరవ తీసుకుంటాం..

- జలజీవన్ ను వైసీపీ పట్టించుకోలేదు
ఆంధ్రప్రభ బ్యూరో, శ్రీకాకుళం : రాష్ట్రంలో జల జీవన్ మిషన్ ను వైసీపీ సర్కారు నిర్లక్ష్యం చేసిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎంపీ లాడ్స్, నేషనల్ హైవేస్, జల జీవన్ మిషన్ పథకాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
సంబంధిత అధికారులతో మాట్లాడి క్షేత స్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. సమీక్షలో కీలక అంశాలను మీడియాకు వివరించారు.
పార్లమెంట్ సభ్యుడి లోకల్ ఏరియా డెవలప్ మెంట్ నిధులకు ఒక ప్రత్యేకత తీసుకొచ్చిన ఘనత దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు ది అని గుర్తు చేసిన రామ్మోహన్ నాయుడు.. జిల్లా నలుమూలలకు ఎన్నో కార్యక్రమాల ద్వారా ఆయన చేరువ అయ్యారు అని స్పష్టం చేశారు.
ఈ పదేళ్లలో అదే స్పూర్తితో అనేక కార్యక్రమాలను నిర్వహించామని, ప్రభుత్వం నిర్వహించలేని వాటిని ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా సాధ్యం చేసుకుంటున్నామని అన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బస్ కాంప్లెక్స్, ఎలక్ట్రికల్ లైన్లు, సోలార్ లైన్లు ఇతర ప్రాజెక్టులను స్థానిక ఎమ్మెల్యేల డైరక్షన్ లో ఎంపీ లాడ్స్ ద్వారా చేసుకుంటూ వచ్చామని తెలిపారు.
ఏ సంవత్సరం ప్రారంభించిన కార్యక్రమం.. అదే సంవత్సరం ముగించాలి అనే విధానంలో ఎంపీ లాడ్స్ నిధులను ఖర్చు చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
జాతీయ రహదారుల వృద్ధి కి కూడా అప్పట్లో ఎర్రన్నాయుడు గోల్డెన్ ప్రాజెక్ట్ గా రెండు లైన్ల రహదారి నాలుగు లైన్ల కు మార్చారని.. తాను ఆరు లైన్ల రహదారి సాధన కోసం ఇప్పటికే పలు దఫాలుగా కేంద్ర మంత్రిత్వ శాఖకు పరిస్థితులు వివరించామని అన్నారు.
నరసన్నపేట నుండి పాతపట్నం వరకు జాతీయ రహదారిగా వృద్ధి చెయ్యడం కొద్దిగా ట్రాఫిక్ కూడా తగ్గిందన్నారు. కోస్టల్ కారిడార్ ద్వారా తీరానికి ఆనుకొని మరో ఆరు లైన్ల జాతీయ రహదారి వస్తోందని స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టమైన కార్యాచరణ తో ఉన్నారని అన్నారు.
లాజిస్టిక్ కనెక్టివిటీ వల్ల ఎకనామిక్ గ్రోత్ ఉంటుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.. కోస్టల్ కారిడార్ కోసం ఇప్పటికే డీపీఆర్ కోసం విశాఖ పట్నంలో కార్యాలయం కూడా ప్రారంభించడం జరిగింది అని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం వచ్చే సంవత్సరం జూన్ నాటికి పూర్తి చేస్తామని.. దానికి అనుసంధానం అయ్యే జాతీయ రహదారులపై కూడా తాజాగా సమీక్ష నిర్వహించామని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా పరిధిలో 180 కిలోమీటర్లకు పైగా ఉన్న జాతీయ రహదారి లో అనేక బ్లాక్ స్పాట్ లను గుర్తించామని, వీటి దగ్గర అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని, వాటిని తగ్గించడానికి స్పష్టమైన ప్లానింగ్ తో వెళ్ళాలని అధికారులను ఆదేశించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే చోట.. లైటింగ్ ను ఏర్పాటు చెయ్యాలన్నారు.
బ్యూటిఫికేషన్ కి సైతం ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. మూలపేట పోర్ట్ ప్రారంభం తర్వాత.. హైవే పై మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని.. అందుకు తగ్గట్టుగా జాతీయ రహదారి విస్తరణ కూడా త్వరలో జరుగుతుందని స్పష్టం చేశారు. జల జీవన్ మిషన్ ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తూ వెళ్తున్నారని అన్న రామ్మోహన్ నాయుడు.. గత వైసీపీ సర్కారు.. రాష్ట్రంలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందని అన్నారు.
జల జీవన్ మిషన్ శక్తి సామర్ధ్యాలు తెలియక వైసీపీ దానిని పట్టించుకోలేదుని విమర్శించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత గతంలో పూర్తి కాని, ప్రారంభానికి నోచుకోని కార్యక్రమాలను మళ్ళీ పునః ప్రారంభిస్తున్నామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వంతో మళ్లీ సంప్రదింపులు జరిపి అవన్నీ పూర్తి చేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జల జీవన్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటే.. శ్రీకాకుళం పరిస్థితి మరింత దారుణంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఉద్దానం ప్రాజెక్ట్ ను కూడా బలపరుస్తూ వెళ్తున్నామని అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
