అమలాపురం : తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు (Sisters) వింత కోరికతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం (thalliki vandanam) డబ్బులు తమ తల్లికి కాకుండా తండ్రికి ఇవ్వాలని వారు కోరుతున్నారు. కారణం వారి తల్లిదండ్రులు విడిపోయి ఉండటమే. కాలు పనిచేయకపోయినా తమ తండ్రి తమను పోషిస్తున్నాడని, ఆ డబ్బులు ఆయనకు ఉపయోగపడతాయని వారు ఎంపీడీవోను వేడుకున్నారు.
వివరాలలోకి వెళితే .. సీతానగరం బొబ్బిల్లంక (Sitanagaram Bobbillanka) కు చెందిన చిత్రపు సంధ్యన, సునైనాలు అక్కాచెల్లెళ్లు.. వారిద్దరు ఊరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పది, తొమ్మిది తరగతులు చదువుతున్నారు. తమకు ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం డబ్బులు రూ.26వేలను.. తమ తండ్రికి ఇవ్వాలని ఎంపీడీవో (MPDO)కు అర్జీ అందజేశారు.
తమ తండ్రి చిత్రపు అబ్బులు, అలాగే తల్లి కొన్ని కారణాలతో విడిపోయి ఉంటున్నారని అక్కాచెల్లెళ్లు చెబుతున్నారు. అప్పటి నుంచి తాము తండ్రి సంరక్షణలో ఉంటున్నామన్నారు. కాలు పనిచేయకపోయినా సరే తన తండ్రి ఉపాధి పనులు చేసుకుంటూ తమ ఇద్దర్నీ చదివిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి, ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం డబ్బులు తమ తల్లి ఖాతాలో పడుతున్నాయని గుర్తు చేశారు.. ఆ డబ్బులు తమ తల్లి తీసుకుందంటున్నారు.
తమకు స్కూల్లో ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం, బుక్స్, యూనిఫామ్ వంటి సౌకర్యాలతో చదువుకోగలుగుతున్నామన్నారు అక్కాచెల్లెళ్లు సంధ్యన, సునైనా. తాము ప్రస్తుతం నివాసం ఉంటున్న పూరి పాకలో వర్షం వస్తే నీరు కారిపోయే స్థితిలో ఉంటూ చదువుతున్నామన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం డబ్బులు తమ తండ్రికి ఇస్తే తమ అవసరాలు తీర్చుకుంటామని చెప్పినా తమ తల్లి వినడం లేదన్నారు. విద్య కోసం ఇచ్చే డబ్బులు తమ తల్లి స్వంత అవసరాలకు వాడుకుంటున్నదని వాపోయారు.. దీనివల్ల తమ విద్యాభ్యాసం ప్రమాదంలో పడిందన్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి.. తల్లి పేరున ఉన్న బ్యాంక్ అకౌంట్ నిలిపివేయాలని కోరారు. తమను కంటికి రెప్పలా చూసుకుంటున్న తమ తండ్రి పేరున తల్లికి పథకం వర్తింపజేయాలని కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో మాత్రమే కాదు పీజీఆర్ఎస్, సీతానగరం పోలీసుస్టేషన్కు వెళ్లి ఈ అంశంపై మరో వినతిపత్రం అందజేశారు. మరి ఈ అక్కాచెల్లెళ్ల సమస్యను ప్రభుత్వ అధికారులు ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.